ఏడేళ్ల బాలికపై అత్యాచారం: కర్నూలు కోర్టు సంచలన తీర్పు
కర్నూలు: గతంలో ఏడేళ్ల బాలిక పైన అత్యాచారం చేసిన కేసులో సమగ్ర విచారణ జరిపిన కర్నూలు న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చి, జీవించి ఉన్నంత వరకు జైలు శిక్ష అనుభవించేలా సంచలన తీర్పు చెప్పింది. కోర్టు తీర్పు పట్ల బాధితురాలి బంధువులు హర్షం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగిందని వారు అన్నారు.
మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ కేసు పైన సమగ్రంగా దర్యాఫ్తు చేసిన డీఎస్పీతో పాటు పలువురు పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు. కాగా, 2014లో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ తరహా తీర్పు ఇదే మొదటిది కావడం గమనార్హం.
కర్నూలు వన్ టౌన్ పరిధిలో పఠాన్ ఖాజాఖాన్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. గత ఏడాది జూలై 18న సాయంత్రం సమయంలో అదే వీధికి చెందిన పిల్లలు ఆడుకుంటున్నారు.
ఆ సమయంలో ఖాజాఖాన్ చాక్లెట్స్ చూపించి ఏడేళ్ల చిన్నారిని మిద్దె పైకి తీసుకెళ్లాడు. కుమార్తె కనిపించక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వాళ్లు రాత్రంతా వెదికారు. కానీ దొరకలేదు. ఆ తర్వాత రోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో చిన్నారి స్నేహితులు షబానా, మరో అబ్బాయి.. ఆటో అంకుల్ చాక్లెట్ ఇస్తానని చెప్పి తీసుకెళ్లిన్లు తెలిపారు.
వెంటనే ఖాజాఖాన్ ఇంట్లోకి వెళ్లి చూడగా బాలిక ఏడుస్తూ కనిపించింది. ఏం జరిగిందని ప్రశ్నించగా చాక్లెట్ ఇస్తానని అంకుల్ ఇంట్లోకి తీసుకెళ్లాడని ఏం జరిగిందో చెప్పింది.
బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలికకు వైద్య పరీక్షలు జరిపారు. అత్యాచార యత్నం జరిగినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్, అత్యాచారం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండుకు తరలించారు. అతని నేరం రుజువు కావడంతో జీవితమంతా కఠిన కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ప్రేమావతి తీర్పు చెప్పారు.