టీడీపీలోకి కర్నూలు ఎమ్మెల్యే?: భూమా నాగిరెడ్డి పాత్ర ఎంత మేరకు
అమరావతి: టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈనెల 7వ తేదీన చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
వాస్తవానికి ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీని వీడతారని ఎవరూ ఊహించలేదు. టీడీపీ 'ఆపరేషన్ ఆకర్ష్' తొలుత మొదలైంది కర్నూలు జిల్లాలోనే. వైయస్ జగన్కు అత్యంత ఆప్తుడుగా పేరుగాంచిన భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియ టీడీపీలో చేరడంతో ఏపీలో వలసలు ప్రారంభమయ్యాయి.
భూమా, అఖిల ప్రియ టీడీపీలో చేరిన రోజున వారి వెంట మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తారని అందరూ భావించారు. అయితే భూమాని వైసీపీలో ఉండేందుకు స్వయంగా జగన్ దిగి రాజీయత్నాలు చేసిన ఫలించలేదు. దీంతో జగన్ హుటాహుటిన కర్నూలు జిల్లాలో తన పార్టీకి చెందిన మిగిలిన ఎమ్మెల్యేలు అందరినీ పిలిపించి వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సమావేశం అనంతరం కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రెస్మీట్ పెట్టి.. తాము వైకాపాలోనే ఉంటాం అని.. టీడీపీలోకి వెళ్లే అవకాశం లేదని ప్రకటించారు. ఈ ప్రెస్మీట్లో కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అలాంటి ఆయనే ఇప్పుడు టీడీపీలోకి వెళ్లడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుంది.
ఇక ఎస్వీ మోహన్రెడ్డి విషయానికి వస్తే ఇటీవలే టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి స్వయానా బావమరిది. ఆయన భార్య దివంగత శోభా నాగిరెడ్డికి స్వయానా తమ్ముడు. పాలమూరు ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత వైయస్ జగన్ చేయదలచుకున్న దీక్ష గురించి తనకు సమాచారం ఇవ్వలేదని, తన ప్రాధాన్యానికి చెక్ పెడుతున్నారని ఆయన అసంతృప్తితోనే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని కారణంగా చెబుతున్నారు.
ఎస్వీ మోహన్రెడ్డిని 2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డలో తన మేనకోడలు అఖిలప్రియపై పోటీ చేయడానికి జగన్ ఒత్తిడి చేస్తున్నాడనే కొందరు అంటున్నారు. ఎస్వీ మోహన్రెడ్డి కానీ, ఆయన సోదరుడు కానీ అఖిలప్రియపై పోటీచేయాలని జగన్ ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో పార్టీని వదలిపోవడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
ఎస్వీ మోహన్ రెడ్డి టీడీపీలోకి రావడం వెనుక భూమా ఒత్తిడి కూడా కొంత మేరకు ఉన్నట్లు సమాచారం. ఇలా ఈ నెల 7వ తేదీన ఎస్వీ మోహన్రెడ్డి టీడీపీలోకి రానుండడంతో భూమా వర్గానికి చెందిన నేతలు ఒక్కొక్కరిగా వైసీపీని వీడుతుండటం విశేషం.