జగన్ లేకుండా నేనెలా..? వాడు నా మేనల్లుడు : కేవీపీ
హైదరాబాద్ : రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగిన నాయకుల వెనుక.. వాళ్ల ఆత్మ అని చెప్పుకోదగ్గ కొంతమంది నాయకులు ఖచ్చితంగా ఉండి తీరుతారు. అలా.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆత్మగా సీనియర్ రాజకీయ నేత కేవీపీ ముద్ర ఉన్న విషయం తెలిసిందే. వైఎస్ మరణానంతరం జగన్ పెట్టిన పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నారాయన.
ఈ నేపథ్యంలోనే ఆయన జగన్ కుటుంబానికి దూరమయ్యరాన్న వాదన ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఇవే విషయాలపై స్పందించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ గురించి ప్రస్తావిస్తూ.. 'జగన్ అనే వ్యక్తి నా మేనల్లుడండి, వాడు లేకుండా నేనెలా ఉండగలను..? అని స్పందించారు.
జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి దోషం లేదని చెప్పిన కేవిపి 'జగన్ దోషి అనడానికి మనమెవరమండి..? ఏ హక్కుతో ఆ మాట అనగలం' అన్నారు. జగన్ విషయంలో న్యాయ అన్యాయాలను కోర్టులే తేలుస్తాయని చెప్పారు. ఇక జగన్ పై తన వ్యక్తిగత అభిప్రాయం తెలిపిన కేవిపి అవినీతికి సంబంధించిన ఏ అంశాల్లోను జగన్ కల్పించుకోలేదని తెలియజేశారు.
ఇక అక్కడితో జగన్ ప్రస్తావనకు ఫుల్ స్టాప్ పెట్టిన కేవిపి కుటుంబ విషయాలు పక్కనబెట్టి రాజకీయాలు, ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తే మాట్లాడుతానని సదరు టీవి ఛానెల్ కార్యక్రమంలో బదులిచ్చారు.