వైయస్ ఫోటో రాజకీయం: కేవీపీపై టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుపై ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ టీడీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసింది. ఈ మేరకు చివరి రోజైన శుక్రవారం శాసనసభ సమావేశాల్లో ఆ పార్టీ నేతలు స్పీకర్ కోడెలకు నోటీసు ఇచ్చారు.
అసెంబ్లీ లాంఛ్లో తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో ఉంచాలంటూ కేవీపీ ఇటీవలే స్పీకర్ కోడెలకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖలో స్పీకర్ తో పాటు సభను కించపరిచేలా కేవీపీ వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఆరోపించింది.
ఈ ఆరోపణలపై స్పందించిన కేవీపీ, గురువారం స్పీకర్కు మరో లేఖ రాసిన సంగతి తెలిసిందే. లేఖలో ఎవరినీ కించపరచే మాటలుగానీ, అమర్యాదకరమైన భాషగానీ వాడలేదని, గతంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రస్తావించడం బహుశా మీకు బాధ కలిగించి ఉంటుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో పడ్డ ఆవేదన గుర్తు చేసుకుని మీరు బాధ పడి ఉండవచ్చుని పేర్కొన్నారు.
ఆ రోజున అలా ఎందుకు ప్రవర్తించామా అని మదనపడి ఉండవచ్చుని, అయితే, తన ఉద్దేశం బాధ పెట్టడం కాదని, బాలయోగి, సావర్కార్, ఎన్టీఆర్ల పేర్లు రాయడం వెనుక గత చరిత్ర మీ దృష్టికి తేవాలని, తద్వారా మీరు సముచిత నిర్ణయం తీసుకునేందుకు తోడ్పడాలని తన సంకల్పమని పేర్కొన్నారు.
కానీ, మీరు లేఖలో రెండు మూడు వాక్యాలు మాత్రమే చదవి సభను ప్రశ్నించడం తనను అవమానించడమేనని తప్పుబట్టారు. లేఖల్లో అభ్యంతరకరమైన అంశాలు తెలిపితే వివరణ ఇస్తానని చెప్పారు. ఆ లేఖను గురువారం మీడియాకు విడుదల చేశారు.
స్పీకర్ కోడెలకు కేవీపీ రాసిన లేఖను సభా హక్కుల ఉల్లంఘన కింద పరిగణించవచ్చని మంత్రి యనమల పేర్కొనడంతో టీడీపీ శుక్రవారం సమావేశాల్లో భాగంగా కేవీపీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేసింది.