ఎక్కడ తీశారో అక్కడే పెట్టండి: వైయస్ ఫోటోపై కెవిపి, కోర్టుకు జగన్
హైదరాబాద్: అసెంబ్లీ లాంజ్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటం తొలగింపు పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెవిపి రామచంద్ర రావు అసెంబ్లీ స్పీకర్కు బుధవారం నాడు లేఖ రాశారు. మృతి చెందిన నేతల చిత్రపటాలు తొలగించడం సరికాదని, సంప్రదాయం కాదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా పని చేసిన వైయస్ ఫోటోను తీసి వేయడం సరికాదన్నారు. ఆ చిత్రపటాన్ని ఎక్కడ నుంచి తీశారో అక్కడే పెట్టాలని ఆయన లేఖలో విజ్ఞప్తి చేశారు.
ఆస్తుల కేసులో కోర్టుకు జగన్
అక్రమాస్తుల కేసులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు కోర్టుకు హాజరయ్యారు. ఈడీ నమోదు చేసిన కేసులో ఆయన నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఆయనతో పాటు విజయ సాయి రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇసుక ర్యాంప్ వద్ద ధర్మాన ఆందోళన
శ్రీకాకుళం జిల్లాలో ఇసుక ర్యాంప్ వద్ద మాజీ మంత్రి, వైసీపీ నేత ధర్మాన ప్రసాద రావు బుధవారం ఆందోళన వ్యక్తం చేసారు. డ్వాక్రాపేరుతో టిడిపి కార్యకర్తలకు ర్యాంపులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇసుక దందాతో మంత్రి అచ్చెన్నాయుడు ఖాతాలోకి రూ.1 వెళ్తున్నాయని, ఇసుక ర్యాంప్లపై రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామన్నారు.