బాబు లాక్కోవడం వెనుక పెద్ద ప్లాన్, అలా ఐతే ఏడాదిలో ఎన్నికలు: బాంబు పేల్చిన జగన్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమానాశ్రయం కోసం వేలాది ఎకరాలు తీసుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు.
బందర్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమానాశ్రయం కోసం వేలాది ఎకరాలు తీసుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందని వైసిపి అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు.
విమానాశ్రయం కోసం ప్రభుత్వం వేలాది ఎకరాలు తీసుకునే ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ ఆయన బుద్ధవారిపాలెం రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. చంద్రబాబు పైన నిప్పులు చెరిగారు.
మన భూములను మనకే బిచ్చమేస్తారా
మన భూముల్లో మనకు కొంత భూమి ఇవ్వడం ఏమిటన్నారు. ఎకరాల కొద్ది మన భూములను బలవంతంగా లాక్కొని, ఆ తర్వాత భిక్షం వేసినట్లు మనకు వెయ్యి లేదా పన్నెండు వందల గజాలు ఇస్తామని చెప్పడం విడ్డూరమన్నారు. చంద్రబాబు ఇదేం పద్ధతి అని నిలదీశారు.
ఎవరైనా భూములు అమ్మాలనుకుంటే వారికి నచ్చితే అమ్ముతారు లేదంటే ఊరుకుంటారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం బలవంతంగా తీసుకుంటానని చెప్పడం విడ్డూరమన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇక్కడకు వచ్చి ఎయిర్ పోర్టుకు 5,200 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చాక 30వేల ఎకరాలు కావాలని అడుగుతున్నారని మండిపడ్డారు. అసలు విమానాశ్రయానికి ఎన్ని ఎకరాల భూమి కావాలో చంద్రబాబుకు తెలుసా అని ప్రశ్నించారు. ఐదు వేల ఎకరాల్లో బ్రహ్మాండంగా ఎయిర్ పోర్ట్ నిర్మించవచ్చన్నారు.
దేవుడు దయ తలిస్తే ఏడాదిలో ఎన్నికలు
చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుందన్నారు. ఇప్పుడు ఆయనే భూములు లాక్కుంటున్నారని చెప్పారు. తాను ఒక్కటి చెప్పదలుచుకున్నానని, చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదన్నారు. ఈ ప్రభుత్వం సమయం మూడేళ్లు అయిపోయిందని, ఇంకా మిగిలింది రెండేళ్లే అన్నారు.
దేవుడు దయ తలిస్తే వచ్చే ఏడాది ఎన్నికలు రావొచ్చన్నారు. లేదంటే రెండేళ్లలో ఆయన ప్రభుత్వం పోవడం ఖాయమన్నారు. దేవుడి దయ వల్ల రెండేళ్ల పాటు అందరం కలిసి భూములను కాపాడుకుందామని, ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అవసరానికి మించి ఒక్క ఎకరా ఎక్కువ తీసుకోమన్నారు.
వేలాది ఎకరాలు తీసుకోవడం వెనుక బాబు ప్లాన్ ఇదీ.. జగన్ లాజిక్
అవసరం లేకున్నా ఇన్ని భూములు ఎందుకు తీసుకుంటున్నారని, రైతుల ఉసురు తగిలుతుందని మనం చంద్రబాబును అడిగితే ఓ మాట మాట్లాడుతున్నారని జగన్ ఓ లాజిక్ చెప్పారు. పోర్టు కట్టిన తర్వాత రైతులు తమ భూములను ఎకరాకు రూ.కోటి అడుగుతారని, కాబట్టి ఇప్పుడే తీసుకుంటున్నామని చెబుతున్నారని అన్నారు. అంటే రైతుల భూములు ఎక్కువ ధర పలకవద్దా అని నిలదీశారు.
అనంతరం జగన్ పలువురు బాధితులతో మాట్లాడారు.
ఓ మహిళ మాట్లాడుతూ.. తాము విమానాశ్రయ నిర్మాణానికి గజం భూమి కూడా ఇవ్వమని చెప్పారు. దీనిపై జగన్ మాట్లాడుతూ.. అందరం కలిసి కట్టుగా పోరాడాలన్నారు. ఒకరు ఫీజు రీయింబర్సుమెంట్ అంశాన్ని లేవనెత్తారు.
తన తండ్రి (వైయస్) హయాంలో ప్రతి పేదవాడు చదువుకోవాలని ఫీజు రీయింబర్సుమెంట్స్ తీసుకు వచ్చారని, చంద్రబాబు ప్రభుత్వా అవి అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం పోవాలన్నారు. మళ్లీ నాన్నగారి పరిపాలన రావాలన్నారు. కనీసం చదువు కునేందుకు లోన్లు కూడా రావడం లేదన్నారు. ఏ పేదవాడు కూడా అప్పులయ్యే పరిస్థితి రావొద్దన్నారు.
ఓ సందర్భంలో జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఏమాత్రం సిగ్గున్నా, రైతు చెప్పిన మాటలు విని సిగ్గు తెచ్చుకోవాలన్నారు. తన అనుకూల మీడియాను అడ్డు పెట్టుకొని చంద్రబాబు రైతులు సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారన్నారు. ఇప్పుడు బందర్ రైతుల భూములు లాక్కున్నట్లే, రాజధాని రైతుల భూములు కూడా లాక్కున్నారన్నారు. కానీ అక్కడ ఇటుక కూడా పెట్టలేదన్నారు.