లాస్ట్ వర్కింగ్ డే: హైదరాబాదుకు ఎపి ఉద్యోగుల తుది వీడ్కోలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాదుతో సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల బంధం తెగిపోయినట్లే. హైదరాబాదు సచివాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు హైదరాబాద్కు తుది వీడ్కోలు చెప్పినట్లే. శుక్రవారంనాడే హైదరాబాదులో వారి చివరి పనిదినంగా మారింది.
శనివారం, ఆదివారం విరామం తర్వాత సోమవారం (అక్టోబరు 3) నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే వారు పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ఉద్యోగులు హైదరాబాద్లోని సచివాలయానికి భావోద్వేగంతో కూడిన వీడ్కోలు పలికారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు శాఖలు హైదరాబాద్ నుంచి వెలగపూడికి మారాయి. రెవెన్యూ సహా మరికొన్ని శాఖలు శుక్రవారంనాడు హైదరాబాదు కార్యాలయంలో పనులు ముగించుకుని వెలగపూడికి వెళ్లడానికి సిద్ధమయ్యాయి. ఏపీకి సంబంధించి వివిధ విభాగాల అధిపతుల (హెచ్వోడీ) కార్యాలయాలు కూడా ఇప్పటికే తరలిపోయాయి. ఇప్పటికీ హైదరాబాద్లో ఉన్న కొన్ని డైరెక్టరేట్లు మూడు నాలుగు రోజుల్లో విజయవాడకు చేరుకుంటాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
1956 నవంబరు 1వ తేదీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం హైదరాబాద్ కేంద్రంగా పని చేసింది. నిజాంల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ సచివాలయ ప్రధాన సముదాయంలో అరవై ఏళ్ల పాటు పాలన సాగింది. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఇక్కడి నుంచే 28 నెలలపాటు నడిచింది.
మీడియా కథనాల ప్రకారం - లక్షలాది ఫైళ్లను స్కాన్చేసి ఆన్లైన్లో పొందుపరిచారు. మాన్యువల్ ఫైళ్లను ప్రత్యేకంగా రికార్డు రూముల్లో భద్రపరిచారు. కోర్టు కేసులు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఫైళ్లను కూడా ఇక్క డే భద్రపరిచినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తి కావడంతో శనివారం సెలవు ప్రకటించారు.
కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా హైదరాబాద్ సచివాలయంలో భవనాలను పూర్తిగా ఖాళీ చేయడం లేదు. రికార్డుల నిర్వహణ, కోర్టు కేసులు చూసుకోవడానికి కొందరు ఉద్యోగులు హైదరాబాద్లోనే ఉంటారు.