బాబు, లోకేష్లపై లక్ష్మీపార్వతి ఫైర్, భారతరత్నపై హరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరుతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు సేకరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి ఆరోపించారు. లోకేష్ను ప్రమోట్ చేసేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్లో ఆమె నివాళులర్పించారు. పేదలు, మహిళలు బలహీనవర్గాల కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. చంద్రబాబు టీడీపీకి వారిని దూరం చేస్తున్నారన్నారు. 9 ఏళ్ల తన పాలనలో నాడు చంద్రబాబు రైతుల ఉసురుపోసుకున్నారన్నారు.
మళ్లీ వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేలా బాబు వ్యవహరిస్తున్నారన్నారు. రాజధానికికి 30వేల ఎఖరాలు సేకరించానని చెబుతున్నా, అందులో 17వేల ఎకరాలు కూడా లేవని మండిపడ్డారు. రాజధాని పేరుతో పదివేల ఎకరాలు సింగపూర్కు ధారాదత్తం చేసి రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు.
నారా లోకేష్ను ప్రమోట్ చేసేందుకు చంద్రబాబు దిగజారుజు రాజకీయాలు చేస్తున్నారన్నారు. నారా లోకేష్ ఏ హోదాలో అమెరికాలో పర్యటించారో చెప్పాలన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి లోకేష్ సాధించిందేమిటన్నారు.
ఎన్టీఆర్కు భారతరత్నపై హరికృష్ణ, దేవినేని
స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని నందమూరి హరికృష్ణ విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ను గౌరవించుకోవడం తెలుగువారందరి కర్తవ్యమన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్న హరికృష్ణ తెలుగువారంతా ఐక్యంగా ఉండాలన్నారు.
ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులులర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడారు.
ఎన్టీఆర్కు భారతరత్న కోసం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీలకు ఆదర్శంగా నిలిచాయన్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నేడు జాతీయ పార్టీగా ఆవిర్భవించవోతోందన్నారు. జాతీయ పార్టీగా విజయం సాధిస్తామన్నారు. ఎన్టీఆర్ గొప్ప నటుడే కాదు రాజకీయవేత్త అని, సామాన్యుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.