చిరంజీవి నేర్పిన పాఠం!: అలా తొందరపడనని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తనను పోలవరం డంపింగ్ బాధిత రైతులు బుధవారం నాడు కలిసినప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా మాట్లాడారు.
విజయవాడ: తనను పోలవరం డంపింగ్ బాధిత రైతులు బుధవారం నాడు కలిసినప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరంగా మాట్లాడారు. బాధిత రైతుల విషయంలో సానుకూలంగా స్పందించిన పవన్, తన పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
నిన్న కేటీఆర్ సూచన.. బ్రాండ్ అంబాసిడర్గా సిద్ధమని స్వయంగా పవన్ కళ్యాణ్
అంతేకాదు, పార్టీ విషయంలో తాను అందరిలా తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని, పార్టీ నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తానని, ప్రజారాజ్యం పార్టీ నుంచి పాఠాలు నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. అందరిలా తొందరపడనని, ప్రజారాజ్యం పార్టీ అనుభవం ఉందని చెప్పడం గమనార్హం. తద్వారా ఆయన చిరంజీవిలా తాను తొందరపడనని వ్యాఖ్యానించారా అనే చర్చ సాగుతోంది.
మాకు న్యాయం చేయండి: చంద్రబాబుపై పవన్ కళ్యాణ్కు మరో ఫిర్యాదు
2008లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టడం, 2009 ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ తర్వాత రెండేళ్లకు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం తెలిసిందే. పీఆర్పీని కాంగ్రెస్లో విలీనం చేసిన నేపథ్యంలో తమ్ముడు అన్నయ్యకు దూరం జరిగాడనే వాదనలు ఉన్నాయి.
ఆ తర్వాత జనసేనను స్థాపించి టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారు. అయితే, రాజకీయ లక్ష్యం విషయంలో అన్నాతమ్ముళ్లు ఒకరి పైన మరొకరు ప్రశంసలు కురిపించుకుంటారు. తమ దారులు వేరయినా లక్ష్యం ఒక్కటేనని చెబుతారు.
ఇదిలా ఉండగా, తనను కలిసిన రైతులకు కూడా ఆయన ఊరట కలిగించే మాటలు మాట్లాడారు. పోలవరం నిర్మాణంలో కనిపించే సమస్యలతో పాటు కనిపించని సమస్యలు చాలా ఉంటాయని, అధికారులు రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు.
కాంట్రాక్టర్లు లాభాల కోసం రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. పోలవరం రైతుల సమస్యలపై ప్రభుత్వ స్పందనను బట్టి రెండు, మూడు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
గట్టిగా మాట్లాడనని అంటున్నారు
తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు వచ్చినప్పుడు తాను గట్టిగా మాట్లాడనని, నెమ్మదిగా మాట్లాడుతానని కామెంట్లు వినిపిస్తున్నాయని, అయితే గట్టిగా మాట్లాడామా? ఘర్షణ పడ్డామా? లేదా? అన్నది సమస్యకు పరిష్కారం కాదన్నారు.
తాను గట్టిగా మాట్లాడడం వల్ల, ఘర్షణ పడడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా? అని ఆయన అడిగారు. తనకు సమస్యలు పరిష్కారం కావడం ముఖ్యమన్నారు. ప్రజా సమస్యలపై తనదైన శైలిలో పోరాటం చేయడం తన విధానమన్నారు. తనపై విమర్శలు చేసేవారు అన్నీ గమనించాలన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, కానీ ప్రభుత్వం ఇబ్బంది ఏమిటో తనకు తెలియదన్నారు. లంక గ్రామాల్లో ఎస్సీ రైతులకు 1450 గజాలు ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించిందని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. లంక గ్రామాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితి తెలుసుకుంటానని చెప్పారు.