కెసిఆర్పై ధ్వజమెత్తుతూ బ్యాలెట్ బాక్సుల్లో లేఖలు
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇచ్చే దిశలో సాగుతున్న నేపథ్యంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆశ్చర్యకరమైన విషయం బయట పడింది. హైదరాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారంనాడు హైదరాబాదు నగరంలోని విక్టరీ ప్లే గ్రౌండ్స్లో జరుగుతోంది.
బ్యాలెట్లతో పాటు బాక్సుల్లో కొన్ని లేఖలు కూడా వేశారు, తెలంగాణ సీఎం కేసీఆర్ను హెచ్చరిస్తూ ఆ లేఖలు రాశారు. కేసీఆర్ తీరు మార్చుకోకపోతే గుణపాఠం చెపుతామంటూ లేఖల్లో రాయడం ఆసక్తికరంగా మారింది. నిరుద్యోగులను నిలువునా ముంచేశారని, కాంట్రాక్టు ఉద్యోగులను ఎప్పుడు క్రమబద్దీకరిస్తావని ప్రశ్నల వర్షం కురిపించారు. బ్యాలెట్ బాక్సుల్లో బయట ఈ లేఖలు కలకలం రేపుతున్నాయి.
నిధులు, ఉద్యోగాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్ తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, కుటుంబపాలన కొనసాగిస్తున్నారని లేఖలు రాశారు. హైదరాబాద్కు చెందిన బ్యాలెట్ బాక్సుల్లో నుంచి ఈ లేఖలు బయటపడ్డాయి.
అటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాల బ్యాలెట్ బాక్సుల్లోనూ లేఖలు బయటపడ్డాయి. డీఎస్సీపై ప్రకటన చేయాలని, ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలని, కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరించాలంటూ వినతి పత్రాలు దర్శనమిచ్చాయి.