బొత్స, దర్మాన ఉన్నారు, లాగుతాం: లిక్కర్ సిండికేట్లపై పల్లె
హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో సిండికేట్ల అక్రమార్జన లెక్కలు తేల్చాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ స్కాంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సహా చాలామంది ఉన్నారని, వారందరినీ బయట పెడతామని అన్నారు. దీనిపై అవసరమైతే పునర్విచారణ చేయించాలని మంత్రివర్గానికి సిఫార్సు చేస్తామని తెలిపారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ కూడా గత పదేళ్లలో భారీ ఎత్తున జరిగిందని, ఇప్పటికి మొత్తం 12 వేల టన్నులను సీజ్ చేశారని పల్లె చెప్పారు. ఈ స్మగ్లింగ్ కేసులను వేగంగా విచారణ చేయిస్తామని, అందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాన్ పిక్, లేపాక్షి భూములను వెనక్కి తీసుకోవాలని ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పారు. న్యాయసలహాలు తీసుకున్నాక వాటిపై పూర్తిస్థాయి నిర్ణయం తీసుకుంటామని వివరించారు.
రాష్ట్రంలో పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి దేశ బడ్జెట్కు రెండింతలు ఉంటుందని ఎపి మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలోని అవినీతిపై తిరిగి విచారణ జరిపిస్తామని చెప్పారు. అవినీతిపై ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సబ్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పల్లె మీడియాకు వివరించారు.
ఎపిలో మద్యం సిండికేట్లతో రాష్ట్ర ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో లిక్కర్ సిండికేట్ల కుంభకోణంపై తిరిగి విచారణ జరిపిస్తామన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతంలో మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులపైనా లిక్కర్ సిండికేట్ ఆరోపణలొచ్చాయని గుర్తు చేశారు. ఆ కేసులను తిరిగి విచారణ చేయాల్సిన అవసరం ఉందా? అన్న దానిపై పరిశీలిస్తున్నామని చెప్పారు.
వీటితోపాటు నిబంధనలు ఉల్లంఘించిన లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కేటాయించిన భూముల సేల్ డీడ్ రద్దుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ప్రస్తుత అటవీ చట్టాలతో స్మగ్లర్లకు సరిగ్గా శిక్షపడడం లేదని చెప్పారు.