ఒక యువతితో సహజీవనం: మరొకరితో పెళ్లికి రెడీ
విజయవాడ: ఓ యువతితో సహజీవనం చేస్తూ మరో యువతితో పెళ్లికి సిద్ధమైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో శుక్రవారంనాడు చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఓ యువతితో అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ నాయక్ సహజీవనం చేస్తున్నాడు.
అయితే, ఆమెకు తెలియకుండా మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మహిళ అనుమానాస్పద మృతి
గుంటూరు జిల్లాలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఈ శుక్రవారం ఈ సంఘటన జరిగింది. రేపల్లెలోని ఆకుల లక్ష్మి (40) భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉంటోంది. అయితే, శుక్రవారం ఆమె అనుమానాస్పద స్థితిలో మరణించింది.
ఆమె మరణించిన సమాచారాన్ని గ్రామస్థులు పోలీసులకు అందించారు. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలంలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మరణించారు. మండలంలోని రెంటపాళ్ల గ్రామంలోని పంట పొలాల్లో పిడుగు పడింది. ఆ సమయంలో పొలంలో పనిచేస్తున్న మహిళలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు.