'చంపిరిరా.. నన్ను చంపిరి..': నారాయణరెడ్డి హత్యపై ప్రత్యక్ష సాక్ష్యుల కథనం..
నారాయణరెడ్డిపై వేటకొడవళ్లతో దాడికి దిగి.. తల నరికి రాళ్లతో కొట్టి చంపేశారని అన్నాడు. హత్య సమయంలో.. 'చంపిరిరా.. నన్ను చంపిరిరా' అంటూ నారాయణ ఆర్తనాదాలు పెట్టాడని చెప్పాడు.
కర్నూలు: ప్రత్యర్థుల ఫ్యాక్షన్ దాడికి హతమైన నారాయణరెడ్డి హత్యకు సంబంధించి పలువురు ప్రత్యక్ష సాక్ష్యులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. హత్య సమయంలో నారాయణరెడ్డి ఆర్తనాదాలు చేసిన తీరు.. ప్రత్యర్థులు ఎలా దాడికి పాల్పడింది వంటి విషయాలను పూసగుచ్చినట్లు చెప్పారు.
'ఎస్కేప్' ఛాన్స్ లేకుండా: విస్తుపోయే ప్లాన్! నారాయణరెడ్డి హత్య జరిగిందిలా..(ఫోటోలు)
నిజానికి నారాయణరెడ్డి హత్య జరిగిన సమయంలో.. ఆయనతో పాటు చాలామంది అనుచరులు వెనుక జీపులో వస్తున్నారు. కానీ ఆయనపై దాడి జరుగుతుందని తెలియగానే.. ప్రాణాలు దక్కించుకోవడానికి.. వారంతా తలో వైపు చెల్లాచెదరుయ్యారు. ఒక్క సాంబశివుడు మాత్రమే ప్రత్యర్థులను ఎదుర్కొనే ప్రయత్నం చేసి వారి దాడిలో బలైపోయాడు.
డ్రైవర్ ఏం చెప్పాడు?:
ముందు నారాయణరెడ్డి కారు వెళ్తుంటే.. వెనుకాలే ఆయన అనుచరులు మరో జీపులో కారును అనుసరిస్తున్నారు. రామకృష్ణాపురం కల్వర్టు వద్దకు రాగానే.. వెనుక నుంచి వచ్చిన ఒక ట్రాక్టర్ నారాయణరెడ్డి కారును ఢీకొట్టింది. బ్రేక్ సరిగా పడనందువల్లే ఢీకొట్టి ఉంటాడని తాను భావించినట్లు డ్రైవర్ ఎల్లప్ప చెప్పాడు.ఇంతలోనే మరో ట్రాక్టర్ ముందు నుంచి వచ్చి ఢీకొట్టిందని, ఒకేసారి రెండు వైపుల నుంచి రెండు ట్రాక్టర్లు ఢీకొట్టడంతో.. జీపు కిందకెళ్లిపోయిందని ఎల్లప్ప తెలిపాడు.
వెనువెంటనే దాడి:
ట్రాక్టర్లతో కారును ఢీకొట్టిన అనంతరం ప్రత్యర్థులు బండరాళ్లతో దాడి చేశారు. ఆపై వేటకొడవళ్లు, కత్తులతో దాడికి దిగారు. ఆ సమయంలో నారాయణరెడ్డి.. కారు ముందు భాగంలో కూర్చున్నారు. మరో పక్క ట్రాక్టర్ అడ్డంగా ఉండటంతో కారు దిగేందుకు ఆయనకు వీలుపడలేదు.అదే సమయంలో డ్రైవింగ్ స్థానంలో ఉన్న తనను.. పోతావా? లేక నినన్ను కూడా చంపాలా? అంటూ ప్రత్యర్థులు హెచ్చరించారని ఎల్లప్ప తెలిపాడు. దీంతో తాను కారు దిగి పారిపోయినట్లు చెప్పుకొచ్చాడు.
చంపిరిరా.. నన్ను చంపిరిరా..:
నారాయణరెడ్డితో పాటు వెళ్తున్న అనుచరులందరిని బెదిరించి అక్కడి నుంచి పంపించేశారని ఎల్లప్ప తెలియజేశాడు. ఒక్క సాంబశివుడు మాత్రమే వారికి ఎదురు తిరగడంతో.. కొద్ది దూరం తీసుకెళ్లి అతన్ని నరికి చంపేశారన్నాడు. ఆ వెంటనే నారాయణరెడ్డిపై వేటకొడవళ్లతో దాడికి దిగి.. తల నరికి రాళ్లతో కొట్టి చంపేశారని అన్నాడు. హత్య సమయంలో.. 'చంపిరిరా.. నన్ను చంపిరిరా' అంటూ నారాయణ ఆర్తనాదాలు పెట్టాడని చెప్పాడు.దాడికి పాల్పడిన ప్రత్యర్థులు మొత్తం 20మంది దాకా ఉండవచ్చునని ఎల్లప్ప అన్నాడు. వారిలో నలుగురిని గుర్తు పట్టానని తెలిపాడు. ట్రాక్టర్ నడిపినవారిలో రామాంజనేయులు, రామానాయుడుతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారన్నాడు. మిగతావాళ్లంతా మాస్కులు వేసుకుని వచ్చారని, హత్య తర్వాత తిరిగి ట్రాక్టర్లపై వెళ్తూ.. కొడవళ్లు తిప్పుకుంటూ పోయారని ఘటన గురించి వివరించాడు.
వెనకాలే ఉన్న మరో జీపు డ్రైవర్:
"కల్వర్ట్ వద్ద నారాయణరెడ్డికి చెందిన రెండు వాహనాలు పక్క పక్కనే వెళ్తున్నాయి. కల్వర్టుకు మరమ్మత్తులు జరుగుతుండటంతో మా వాహనాలు స్లో అయిపోయాయి. ఇంతలో ఓ ట్రాక్టర్ నారాయణ రెడ్డి రెండు వాహనాల మధ్య దూరింది. ఆపై అదే ట్రాక్టర్ నారాయణరెడ్డి ఉన్న కారును వెనుక నుంచి ఢీకొట్టింది. డ్రైవర్ ఎల్లప్ప మిర్రర్ నుంచి వెనుక వైపు చూసేలోపే ముందు నుంచి మరో ట్రాక్టర్ ఢీకొట్టింది.
అప్పుడు అనుమానమొచ్చింది. అబ్బా.. రెడ్డిని చంపిరే అని కేకలు పెట్టాను. బండి స్లో చేసి దిగడానికి ప్రయత్నిస్తుంటే..ఎడమ వైపు బాంబు విసిరారు. దీంతో మమ్మల్ని కూడా చంపుతారన్న భయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాం. మేం వెళ్లేటప్పటికే.. నారాయణరెడ్డిని వేటకొడవళ్లతో పొడుస్తున్నారు.." అని కృష్ణమోహన్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. నారాయణరెడ్డి కారు ముందు వెళ్తున్న సమయంలో.. ఇతని వాహనం ఆ కారు వెనకాల ఉంది.
పోలీసులకు ఫిర్యాదు:
తమ వద్ద ఆయుధాలు ఏమి లేకపోవడంతో.. ముందుకెళ్లే ధైర్యం లేక పోలీసుల వద్దకు వెళ్లినట్లు కృష్ణమోహన్ తెలిపారు. సార్.. రెడ్డిని చంపుతున్నారు సార్! అని ఫిర్యాదు చేస్తే.. తమతో పాటు నలుగురైదుగురు పోలీసులు బైక్ లపై వచ్చారు. ఈలోగా సాంబశివుడిని చంపినవారు పొలాల్లో నుంచి, నారాయణరెడ్డిని చంపినవారు చెరుకులపాడు వైపు ట్రాక్టర్ లో పారిపోయారని తెలియజేశారు. ఈ మొత్తం ఘటన 10నిమిషాల్లో జరిగిపోయిందన్నారు.
గతంలో కేఈ బెదిరింపు:
నాగరాజు అనే చిట్యాల గ్రామస్తున్ని కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యాంబాబు గతంలో బెదిరించిన సమయంలో.. నారాయణరెడ్డి హత్య గురించి హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని నాగరాజు వెల్లడించాడు. సుధాకర్ రెడ్డి కట్ట విషయంలో తలదూరుస్తున్నావంటూ హెచ్చరించిన శ్యాంబాబు.. మీ నారాయణ రెడ్డి ఆర్నెళ్ల కంటే ఎక్కువ బతకడు అని బెదిరించినట్లుగా నాగరాజు తెలిపాడు.