సహజీవనం చేశాడు, డబ్బు, నగలతో పరారయ్యాడు: యువతి ఆవేదన
వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్పిన యువకుడు.. సహజీవనం చేసేందుకు ఆ యువతిని ఒప్పించాడు. దీంతో వారిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు.
హైదరాబాద్: వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్పిన యువకుడు.. సహజీవనం చేసేందుకు ఆ యువతిని ఒప్పించాడు. దీంతో వారిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే, హఠాత్తుగా ఆమెను విడిచి వెళ్లిన యువకుడు మళ్లీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులను ఆశ్రయించింది.
బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒంగోలుకు చెందిన యువతి(21) ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తూ ఆర్కే పురంలో నివాసం ఉంటోంది. ఫిలింనగర్లో నివాసం ఉంటున్న రమణబాబు(27)తో ఇటీవల ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే ప్రేమగా మారింది.
త్వరలోనే పెళ్లి చేసుకుందామని నమ్మించడంతో ఇద్దరూ కలిసి ఫిలింనగర్లో గది అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నానని, డబ్బులు కావాలని అడగడంతో తనవద్ద ఉన్న బంగారు నగలు, రూ.25వేల నగదును రమణబాబుకు ఇచ్చింది యువతి. తన స్నేహితుడి ఎంగేజ్మెంట్ ఉందని కొంత డబ్బు కావాలని అడగడంతో తనమెడలోని మరో రెండు తులాల బంగారు గొలుసు కూడా ఇచ్చింది.
ఎంగేజ్మెంట్ కోసం అని వెళ్లి పోయిన రమణబాబు ముఖం చాటేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పాటు బాధితురాలు ఇంట్లో లేని సమయంలో వచ్చి తన సామాన్లు తీసుకుని ఉడాయించాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.