లోకేష్ వద్దకు చేరిన విజయవాడ పంచాయితీ, సింగిల్ టెండర్ల రద్దే కారణమా?
విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.నివాస్ తో స్థానిక ప్రజాప్రతినిధులకు పొసగడం లేదు.నిబంధనలకు విరుద్దంగా పనులు చేయడం లేదంటూ నివాస్ పై ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేశారు.ఈ విషయమై చినబాబు వద్దకు పంచాయితీ చేరిం
విజయవాడ: విజయవాడ మున్సిపల్ కమిషనర్ జి.నివాస్ తో స్థానిక ప్రజాప్రతినిధులకు పొసగడం లేదు.నిబంధనలకు విరుద్దంగా పనులు చేయడం లేదంటూ నివాస్ పై ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేశారు.ఈ విషయమై చినబాబు వద్దకు పంచాయితీ చేరింది.
విజయవాడలో పంచాయితీలు ఎక్కువవయ్యాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు మధ్య జరిగే పంచాయితీలు పెరిగాయి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ జి. నివాస్ కు, ప్రజాప్రతినిధులకు అసలు పొసగడం లేదు. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు.
తాము చేసిన సిఫారసులను పట్టించుకోవడం లేదంటూ ప్రజాప్రతినిధులు వాపోతున్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే కార్పోరేటర్ల పరిస్థితి ఏలా ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. సింగిల్ టెండర్లను కమిషనర్ రద్దు చేయడంతో ప్రజాప్రతినిధులకు కోపం వచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు మ్యాటర్ ను తీసుకెళ్ళి పంచాయితీని పెట్టాలని అనుకొన్నారు.ఈ లోపు మంత్రి లోకేష్ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఎమ్మెల్యేలు బొండా ఉమ, జలీల్ ఖాన్, నగర మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల రమణరావులు కమిషనర్ వ్యవహరశైలిపై లోకేష్ దగ్గర అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సింగిల్ టెండర్లను రద్దు చేయడాన్ని లోకేష్ కు వివరించారు. నగరంలో పేదలకు పట్టాలు ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతున్న సంగతిని చెప్పారు. సింగిల్ టెండర్లు నిబంధనల ప్రకారంగా రద్దుచేశానని కమిషనర్ మంత్రి లోకేష్ కు వివరించారు. ఈ విషయమై తమకు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేలు ఆరోపించారు. దీంతో లోకేష్ ఇరువర్గాలకు సర్ధిచెప్పారు.
ఇకముందు సమన్వయలోపం లేకుండా కలిసి పనిచేయాలని లోకేష్ సూచించారు. కమిషనర్ కు లోకేష్ క్లాస్ తీసుకొన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్లు కొంతమంది నిబంధనలకు విరుద్దంగా పనులు అడుగుతున్నారని లోకేష్ దృష్టికి తీసుకెళ్ళారు కమిషనర్.కమిషనర్ తమ వార్డుల్లో పర్యటనలకు వచ్చిన సమయంలో కూడ కనీస సమాచారాన్ని ఇవ్వడం లేదని మేయర్, డిప్యూటీ మేయర్, ఎమ్మెల్యేలు చెప్పడంతో అలాంటి సమాచారలోపం లేకుండా చూసుకోవాలన్నారు.
నగరంలో పేదలకు పట్టాలు, ప్రభుత్వ జీవోకు అనుగుణంగా విశాఖపట్టణం, గాజువాక తరహాలో సిద్దం చేయాలని సూచించారు. అందుకు కమిషనర్ కూడ అంగీకరించారు. పంచాయితీ సగం మాత్రమే సెటిల్ అయిందని ప్రజాప్రతినిధులు అంటున్నారు.