భార్యాభర్తలమని చెప్పి దిగి హోటల్లో ఆత్మహత్య చేసుకున్న లవర్స్
అమ్మాయికి పెళ్లి చేసి వారిద్దరిని విడదీశారు. అయితే ఆమె ప్రియుడి చెంతకు పారిపోయి వచ్చింది. ఇద్దరు కలిసి హోటల్లో గది తీసుకుని అందులో ఆత్మహత్య చేసుకున్నారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని హోటల్లో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. తిరుపతి ఈస్ట్ సీఐ రామకిషోర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా మోదుగులగూడేనికి చెందిన టి.రంజిత్ కుమార్ (31) అటవీశాఖలో ఔట్ సోర్సింగ్ కింద డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహమై ఒక పాప ఉంది.
కొంతకాలం క్రితం అతడి భార్య మృతి చెందింది. కాగా, తమ గ్రామానికి వచ్చిన పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం వల్లూరు గ్రామానికి చెందిన మౌనిక (21)తో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇది తెలుసుకున్న మౌనిక కుటుంబ సభ్యులు ఆమెకు మూడు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తితో పెళ్లి చేశారు. జనవరి 22న మౌనిక అత్తింటి నుంచి పుట్టింటికి వచ్చింది. 22వ తేదీన 10వ తరగతి ప్రైవేట్ తరగతుల నిమిత్తం వెళ్తున్నాని చెప్పి మౌనిక తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు మౌనిక కోసం గాలించారు.
అయితే, మౌనిక జనవరి 22వ తేదీన ఇంటినుంచి పారిపోయి రంజిత్ వద్దకు చేరుకుంది. దీనిపై కుటుంబ సభ్యులు అదే నెల 29వ తేదీన ఆచంట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఆ తర్వాత రంజిత, మౌనికలు ఈనెల 13వ తేదీన తిరుపతికి వచ్చి భార్యభర్తలమని చెప్పి ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు.
శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అను మానం వచ్చిన హోటల్ సిబ్బంది గదిలోపలకు చూడగా ఇద్దరూ ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ రామకిషోర్, ఎస్ఐ ఈశ్వరయ్య సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.