ప్రేమించి పెళ్ళిచేసుకొన్నందుకు గ్రామ బహిష్కరణ
చిత్తూరు: ప్రేమ పెళ్ళి చేసుకొన్న జంటకు గ్రామ బహిష్కరణ విధించిన ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగుచూసింది.చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం సాతంబేడుకు చెందిన ఓ అమ్మాయి అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ ను పెళ్ళిచేసుకొన్నందుకు అబ్బాయి కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించారు.
చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలం సాతంబేడుకు చెందిన ఓ అమ్మాయి అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ ను ప్రేమించింది. అయితే ఈ విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు సూళ్లూరుపేటకు చెందిన అబ్బాయితో ఆ అమ్మాయికి పెళ్ళి నిశ్చయం చేశారు.
అయితే ఆ ఆమ్మాయి మాత్రం తానిష్టపడిన ప్రవీణ్ ను పెళ్ళిచేసుకొంది.ఈ లోపుగా మైనార్టీ తీరని తన కుమార్తైను ప్రవీణ్ కిడ్నాప్ చేశాడని అమ్మాయి తల్లిదండ్రులు సూళ్ళూరుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రవీణ్ ను పెళ్ళిచేసుకొన్న ఆ అమ్మాయి తనకు రక్షణ కల్పించాలంటూ సూళ్లూరుపేట కోర్టును ఆశ్రయించింది.ఈ సంగతి తెలియడంతో అమ్మాయి కుటుంబసభ్యులు గ్రామస్తులతో కలిసి ప్రేమజంటతోపాటు అబ్బాయి కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరించారు.
ఈ ప్రేమజంటకు సహకరించిన ముగ్గురు యువకులకు రూ.38 వేల చొప్పున జరిమానా విధించారని గ్రామస్థులు చెబుతున్నారు. అయితే సమాచారం తెలుసుకొన్న అధికారులు మంగళవారం నాడు గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. అయితే తాము ప్రేమజంటతో పాటు అబ్బాయి కుటుంబాన్ని కూడ గ్రామం నుండి బహిష్కరించిన విషయం వాస్తవమేనని గ్రామస్థులు ఒప్పుకొన్నారు. అయితే బాలికను కిడ్నాప్ చేసిన వారిని శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.