16 ఏళ్ల ప్రేమ, వివాహేతర సంబంధం: ఇంట్లో తెలిసి ఆత్మహత్యాయత్నం
విజయవాడ: వివాహేతర సంబంధం వల్ల ప్రియుడు ప్రాణాలు కోల్పోయాడు ప్రియురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. మకరాంపురం గ్రామానికి చెందిన ఇద్దరు వివాహితులకు వివాహేతర సంబంధం ఉంది.
విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వారిని మందలించారు. దీంతో వారిద్దరు గ్రామ శివారుల్లోకి వెళ్లి పురుగుల మందు తాగారు. ప్రియుడు అక్కడికి అక్కడే మృతి చెందాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరిద్దరి మధ్య పదహారేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది.
గ్రామానికి చెందిన రమేష్ అదే గ్రామానికి చెందిన మహిళ గతంలో ప్రేమించుకున్నారు. విషయం ఇంట్లో తెలిసింది. రమేష్ కుటుంబ సభ్యులు అతనిని మందలించారు. దీంతో రమేష్ కవిటి మండలం శిలగాంకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఆరేళ్ల బాబు ఉన్నాడు.
మరోవైపు, ప్రియురాలికి మకరాంపురానికే చెందిన మరో వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు వివాహం చేశారు. ఈమెకు ఇద్దరు పాపలు, ఒక బాబు ఉన్నారు. ఆమె భర్త ఉపాధి పనుల నిమిత్తం దుబాయ్లో ఉంటున్నాడు. రమేష్కు, సదురు మహిళకు ఉన్న పాత పరిచయంతో మళ్లీ సంబంధం మొదలయ్యింది.
ఈ విషయం సోదరునికి తెలియడంతో వారిని మందలించాడు. రమేష్ భార్యకు విషయం చెప్పాడు. కుటుంబ సభ్యులంతా అతనిని నిలదీశారు. అందరికీ తెలిసేసరికి మంగళవారం ఉదయం రమేష్ ప్రియురాలితో కలిసి మకరాంపురం తోటల్లోని చెరువు వద్దకు వెళ్లి పురుగులు మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో, వారు అక్కడకు వెళ్లి వారిద్దర్ని ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందగా, ఆమెను మెరుగైన చికిత్స కోసం బరంపురం ఆసుపత్రికి తరలించారు.