తీవ్ర రూపం దాల్చిన అల్పపీడనం: భారీ వర్షాలు, మత్య్సకారులకు హెచ్చరిక
బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఒడిశా తీరం,
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న ఒడిశా తీరం, ఉత్తర కోస్తాంధ్రపై కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.
తీవ్ర అల్పపీడనంపై 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు నైరుతి దిశలో ఉపరితల ఆవర్తనం వ్యాపించినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పారు. దక్షిణ కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, కోస్తాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపారు.
దక్షిణ కోస్తాకి వాయువ్య దిశలో 50 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని సముద్రంలోకి వెళ్ళే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గడచిన 24 గంటల్లో ఇచ్ఛాపురం, వరరామచంద్రపురంలో 5 సెం.మీ, కొయ్యలగూడెంలో 4 సెం.మీ, టెక్కలి, తిరువూరు, పాతపట్నం, సోంపేట, చింతూరులో 3 సెం.మీల వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు. ఒడిశాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.