కలిసి ముందుకు, విద్యతో పాటు..: తెలంగాణలో మహారాష్ట్ర మంత్రి
వరంగల్: మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కోసం కలిసి పని చేద్దామని మహారాష్ట్ర మంత్రి రాజే అంబరీష్ రావు శనివారం అన్నారు. విద్యతో పాటు క్రీడలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
విద్యతోనే అభివృద్ధి సాధ్య మని, ప్రతీ ఒక్కరు చదువుకోవాలని సూచించారు. అప్పుడే ఈ దేశం ప్రగతి పథంలో నడుస్తుందన్నారు. తాము మూడు తరాలుగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని మంత్రి చెప్పారు.
దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ కార్యవర్గ సభ్యుడు ఇంద్రసేనా రెడ్డి వేరుగా స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.
గత పదేళ్లలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ సర్కారు ప్రజలను ఏమాత్రం పట్టించుకోలేదని, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. విచ్చలవిడిగా అవినీతి, కుంభకోణాలకు పాల్పడి దేశ ఆర్థిక వ్యవస్థను దివాలా తీయించిన ఘనత కాంగ్రెస్ పాలకులకే దక్కుతుందన్నారు.
మోడీ ప్రభుత్వం గత ఆరు నెలల్లో తీసుకువచ్చిన పెను మార్పులను ప్రజలు గ్రహించి ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టారన్నారు. మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అపనిందలు మోపుతోందన్నారు. కాంగ్రెస్ తీరు మారకపోతే ఆ పార్టీకి పూర్తిగా నూకలు చెల్లడం ఖాయమన్నారు.