టీవీ చూసి డబ్బులు పోగొట్టుకున్నాడు: మోసపోయానని
విశాఖపట్నం: ఓ టీవీ ఛానల్లో వచ్చిన కార్యక్రమాన్ని చూసి వేలాది రూపాయలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన విశాఖపట్నంలోని అక్కయ్యపాలెంలో చోటు చేసుకుంది. చివరకు మోసపోయానని గ్రహించిన ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అక్కయ్యపాలెం దరి శాంతిపురం కాలనీకి చెందిన ఎం నిర్దోశ్కుమార్ అనే యువకుడు నవంబర్ 11వ తేదీ రాత్రి ఓ టీవీ ఛానల్లో ఓ కార్యక్రమాన్ని తిలకించాడు. మధ్యలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ముఖాన్ని సగం చూపించి ఈ చిత్రంలోని వ్యక్తి ఎవరో చెప్పి భారీ బహుమతిని గెలుచుకోండని ప్రశ్న వచ్చింది.
వెంటనే నిర్దోశ్ కుమార్ సమాధానాన్ని సెల్ఫోన్లో వారు ఇచ్చిన నెంబర్కు మెసేజ్ పంపించాడు. వెంటనే నిర్దోష్కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీరు రూ.12.50 లక్షలు బహుమతి గెలుచుకున్నారు. ఈ మొత్తానికి కారు కావాలా? లేకపోతే నగదు కావాలా? అని అడిగారు. నగదు కావాలని నిర్దోశ్ సమాధానమిచ్చాడు.
అయితే మీరు వెంటనే రూ. 6,300 చెల్లించాలని తెలిపారు. దీంతో తన ఖాతాలో నుంచి వారు చెప్పిన ఖాతాకు డబ్బులు జమ చేశాడు నిర్దోష్. మరొక గంట తర్వాత మీ చెక్ లావాదేవీలు పూర్తయ్యాయి.. మరొక రూ. 12,600 కట్టాలని అడగడంతో.. ఆ నగదును కూడా కుమార్ పంపించాడు.
ఆ తర్వాత మరో గంటకు ఫోన్ చేసి మీ చెక్కు అంతరాయం కలుగుతోంది, కొన్ని పన్నులు అదనంగా చెల్లించాలని.. వెంటనే రూ. 25వేలు జమ చేయాలని నిర్దోష్ను కోరారు. దీంతో అనుమానం వచ్చిన నిర్దోష్ కుమార్, తాను మోసపోయానని గ్రహించి నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.