ఉద్యోగాల పేరిట మోసం: రూ. 8కోట్లకు టోకరా
సిఐ మురళీ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హిందూపురంకు చెందిన షేక్ అంజాద్ పర్వేజ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులకు ఆశ చూపి వారి వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. దీంతో మోసపోయిన ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ ప్రాంతాలకు చెందిన ఏడుగురు బాధితులు సిఐ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు.
అంజాద్ యాహూ కంపెనీలో టీం లీడర్గా పని చేసేవాడు. గత జూన్లో యాహూ నుంచి వైదొలిగాడు. అనంతరం బెంగళూరులో ఓ కంపెనీ స్థాపించి నిరుద్యోగుల వివరాలు సేకరించి, కాల్ లెటర్స్ పంపి, ఇంటర్వ్యూలు నిర్వహించి, ఉద్యోగం ఇచ్చినట్లు నమ్మించి నెలకు రూ. 15వేలు చెల్లించేవాడు.
ఉద్యోగాలు పర్మినెంట్ కావాలంటే ఒక్కొక్కరు రూ. 2 లక్షలు చెల్లించాలని వారిని డిమాండ్ చేశాడు. ఇలా సుమారు వెయ్యి మంది నుంచి డబ్బులు సేకరించిన అంజాద్.. కంపెనీ తీసివేసి పరారయ్యాడు. సపోయామని తెలుసుకున్న బాధితులు హిందూపురం చేరుకుని సిఐకి ఫిర్యాదు చేశారు.
దంపతుల దారుణ హత్య
పశ్చిమగోదావరి: జిల్లాలోని జంగారెడ్డిగూడెంలో వృద్ధ దంపతులు గురువారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. గూడెంకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి మహంకాళి లక్ష్మణరావు(58), ఆయన భార్య తులసికుమారి(54)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. వారి ఇంట్లోనే ఈ హత్య జరిగింది.
హత్యకు గల కారణాలు తెలియరాలేదు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్: 28మందిపై కేసు
ఏలూరులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖ దృష్టి సారించాయి. జిల్లా ఎస్పీ రఘురామ్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు శివారు జాతీయ రహదారిపై కలపర్రు టోల్గేట్ వద్ద గురువారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేపట్టారు. వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 26మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.