గుంటూరులో భగ్గుమన్న పాత కక్షలు: వేటకొడవళ్లతో దాడి, ఒకరు మృతి
అమరావతి: గుంటూరు జిల్లాలో పాత కక్షలు భగ్గమన్నాయి. ఆస్తి తగాదాల నేపథ్యంలో తెనాలి మండలంలోని నేలపాడు-సిరిపురం రహదారి మధ్యలో నలుగురు వ్యక్తులపై ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడి వారిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన నలుగురు ఓ కేసు విషయమై కోర్టుకు వెళ్తుండగా వేట కొడవళ్లతో దాడి చేశారు. వీరంతా కొల్లిపార మండలం తుములూరుకు చెందిన వారిగా గుర్తించారు.
ఎకరం పోలం విషయంలో వీరి మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. దీంతో ఈ దాడికి ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. బాలయ్య తన సన్నిహితులతో కలిసి ప్రయాణిస్తున్న ఆటోను ప్రత్యర్థులు అంబాసిడర్ తో డీకొట్టి ఆ తర్వాత వేట కోడవళ్లతో దాడి చేశారు.
ఈ దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.