ప్రియుడితో ఉన్న భార్యని చంపాడు!, మూడో పెళ్లికి భర్త..
చిత్తూరు/రాజమండ్రి: అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా నరికి చంపిన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతినగరంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. అప్పారావు భార్య కమల పైన కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున ఆమె పైన కత్తితో దాడి చేశాడు. దీంతో కమల అక్కడికక్కడే మృతి చెందింది.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ఆమె ప్రియుడితో ఉండగా చూసిన భర్త చంపేశాడనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో ఉండగా చూసిన భర్త ఇద్దరి పైన దాడి చేశాడంటున్నారు. అయితే ప్రియుడు తప్పించుకొని పారిపోయాడంటున్నారు.
మూడో పెళ్లి రెడీ అయ్యాడని భర్తపై ఫిర్యాదు
ఓ వ్యక్తి మొదటి భార్యకు విడాకులు ఇచ్చానని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నాడు. తాజాగా.. మూడో పెళ్లికి సిద్ధం అయ్యాడంటూ భర్త పైన రెండో భార్య పలమనేరు పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని ఒడ్డూరు గ్రామంలో జరిగింది. సంధ్యకు చిరంజీవికి ఈ ఏడాది జనవరి 23న వివాహం జరిగింది.
అప్పటికే వివాహితుడైన చిరంజీవి తాను మొదటి భార్యకు విడాకులిచ్చానని చెప్పి సంధ్యను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా చిరంజీవికి రూ.20వేలు నగదుతోపాటు సుమారు లక్ష రూపాయలు విలువచేసే బంగారు నగలను ఇచ్చారు. వివాహానంతరం చిరంజీవి ఇంటి నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయేవాడు. పలువురితో వివాహేతర సంబంధాలు పెట్టుకొని సంధ్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు.
ఈ వేధింపులు తట్టుకోలేక సంధ్య పుట్టింటికి వచ్చేసింది. తాజాగా చిరంజీవి మరో యువతిని వివాహం చేసుకోవడానికి తేదీలు ఖరారు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సంధ్య జరిగిన సంఘటనపై ఆదివారం తల్లితో కలిసి పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.