కేసీఆర్ జోరు-బాబు బేజారు, టీడీపీలో ఇంకెందరో?: రేవంత్ ఇష్యూలో తెరాసకు రివర్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకొని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం దినోత్సవం నాడు రెండో ఏటిలోకి ప్రవేశించింది. ఈ ఏడాదిలో 63 మందిగా ఉన్న తెరాస ఎమ్మెల్యేల సంఖ్య 76కి చేరుకుంది. రాజకీయంగా ఈ ఏడాది తెరాస ఆపరేషన్ ఆకర్ష్కు చాలామంది ఎమ్మెల్యేలు లోనయ్యారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్, టీడీపీలు తెరాస పైన ఓ కామెంట్ చేశాయి. తెలంగాణ వస్తే తన ప్రభావం తగ్గుతుందనే కేసీఆర్ తెలంగాణ రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించాయి. అయితే, తెలంగాణ వచ్చి ఏడాది గడిచినా కేసీఆర్ దూకుడు కనిపిస్తోంది.
నిరుడు జరిగిన ఎన్నికల్లో 63 మంది మాత్రమే గెలిచారు. ఆ తర్వాత టీడీపీ నుండి ఐదుగురు, కాంగ్రెస్ నుండి నలుగురు, బీఎస్పీ నుండి ఇద్దరు, వైసీపీ నుండి ఇద్దరు కారు ఎక్కారు. దీనిపై విమర్శలు ఎలా ఉన్నప్పటీకీ.. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా వారు కారు ఎక్కుతున్నారని చెబుతున్నారు.
తెలంగాణలో టీడీపీ ప్రభావం రోజు రోజుకు తగ్గుతోంది. ఎన్నికల్లో 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే ఇప్పుడు పదిమంది మాత్రమే ఉన్నారు. అందులో ఇంకెంత మంది పార్టీలో మిగులుతారనేది అనుమానమే. టీడీపీ నుండి మరికొందరు తెరాసలో చేరుతారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని అంటున్నారు. ఈ ఏడాదిలో పార్టీ ప్రభావం పెరిగింది లేదా తరిగింది అంతగా లేదనే చెప్పవచ్చునంటున్నారు. అయితే, నలుగురు ఎమ్మెల్యేలను తెరాస లాక్కోవడం గమనార్హం.
తెరాసకు ధీటుగా ఒక్క బీజేపీ మాత్రమే కనిపిస్తోందని అంటున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా కనిపిస్తోంది. అయితే, టీడీపీతో బీజేపీ పొత్తు అంశం కేంద్రం పరిధిలోనిది. దీంతో టీడీపీ, బీజేపీలు పొత్తుతోనే వెళ్ళే అవకాశాలున్నాయి. అయితే, ప్రస్తుత టీడీపీ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఏమైనా పునరాలోచన చేస్తుందా అనేది ముందు ముందు చూడాలి.
రేవంత్ విషయంలో కేసీఆర్కు రివర్స్!
నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపిన తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి అరెస్టయ్యారు. ఈ అంశం తెరాసకు ప్లస్ అని చెప్పవచ్చు. అయితే, అదే సమయంలో విపక్షాలు.. కాంగ్రెస్, బీజేపీలు కూడా రేవంత్ది ఎంత తప్పో తెరాసదీ అంతే తప్పు అని మండిపడుతున్నాయి.
63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పటికీ కేసీఆర్ 5గురు అభ్యర్థులను ఎలా నిలబెట్టారని, మిగతా ఎమ్మెల్యేలను కొని ఓటు వేయించుకుందామని తెరాస కూడా భావించిందని, అందుకే బలం లేకున్నా ఐదుగుర్ని నిలబెట్టిందని అంటున్నారు. విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను కేసీఆర్ సంతలో పశువుల్లా కొంటున్నారని టీడీపీ భగ్గుమంటోంది.
ఇదిలా ఉండగా, మొదటి నుండి రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని ప్రభుత్వం మాట్లాడకుండా చేసిందని గతంలో టీడీపీ ఆరోపించింది. నిన్నటి అరెస్టు విషయంలోను కేసీఆర్ అతనిని టార్గెట్గా పెట్టుకొని ఇలా చేశారని ఆరోపిస్తున్నారు.