మావోయిస్టుల టార్గెట్లో ఏపీ మంత్రి కొడుకు: ఉత్తరాంధ్రలో సంచలనం రేపుతోన్న లేఖ..
ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొంతమంది గిరిజనులను బినామీలుగా మార్చుకుని విజయ్&కో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు మావోయిస్టు పార్టీ తమ లేఖలో ఆరోపించింది.
విశాఖపట్నం: మావోయిస్టుల టార్గెట్లో ఏపీ సీఎం చంద్రబాబు పేరు ఏళ్లుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సీఎంతో పాటు ఇటీవలి కాలంలో పార్టీలోని పలువురి నేతలను కూడా మావోలు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడికి మావోల నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఓవైపు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పోరాడుతుంటే.. మరోవైపు మంత్రి తనయుడు విజయ్ క్వారీ తవ్వకాలకు పాల్పడుతున్నాడని మావోలు ఆరోపిస్తున్నారు. విశాఖ జిల్లా జీకే వీధి మండలం సరుగుడు క్వారీ వెలికతీతలో విజయ్ కు పెద్ద ఎత్తున వాటాలు ఉన్నట్లు తాజాగా రాసిన ఓ లేఖలో మావోయిస్టులు ఆరోపించారు. మావోయిస్టు పార్టీ తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి కైలాస్ పేరిట ఈ లేఖ విడుదలైనట్లు తెలుస్తోంది.
ఏజెన్సీ ప్రాంతానికి చెందిన కొంతమంది గిరిజనులను బినామీలుగా మార్చుకుని విజయ్&కో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు మావోయిస్టు పార్టీ తమ లేఖలో ఆరోపించింది. వీరి అక్రమాలను ప్రశ్నించినందుకు ఓ జర్నలిస్టును సైతం విజయ్ అనుచరులు అబ్బాయిరెడ్డి, శ్రీనుబెదిరించినట్లు లేఖలో పేర్కొన్నారు. ఇకనైనా వీరిద్దరు తమ ప్రవర్తన మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోలు హెచ్చరించారు. దీంతో మావోలు రాసిన లేఖ ఉత్తరాంధ్రలో సంచలనంగా మారింది.
బాక్సైట్ తవ్వకాల విషయంలో తొలినుంచి గిరిజనులకు మద్దతుగా నిలుస్తున్న మావోయిస్టు పార్టీ.. అక్రమ మైనింగ్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే గతంలోనే ఏపీ కేబినెట్ మంత్రి అయ్యన్నపాత్రుడికి సైతం హెచ్చరికలు చేసింది. తాజాగా అయ్యన్నకుమారుడిని సైతం వారు టార్గెట్ చేయడం గమనార్హం.