రెండు కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా: వరుడి కోరికతో ఆగిన పెళ్లి
విశాఖపట్నం: అదనపు కట్నం వేధింపులతో విశాఖపట్నం జిల్లాలోని వాల్తేరులో బుధవారం ఓ పెళ్లి ఆగిపోయింది. నిశ్చితార్థం రోజున రూ. 10లక్షలు తీసుకున్న పెళ్లి కొడుకు పర్వేశ్ పెళ్లికి రెండు రోజుల ముందే మిగిలిన రూ. 2 కోట్ల కట్నం ఇవ్వాలని వధువు తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. ఇప్పుడు తమవద్ద అంత డబ్బు లేదని, పెళ్లయిన తర్వాత ఇస్తామని చెప్పినా వరుడు పర్వేశ్ ఒప్పుకోలేదు. దీంతో పర్వేశ్ పెళ్లికి నిరాకరించాడు. ఈ విషయంపై వధువు తల్లిదండ్రులు వాల్తేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పర్వేశ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
'ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలి, రూ. రెండు కోట్లు కట్నం, కేజీ బంగారం, అయిదు కేజీల వెండి ఇవ్వండంటూ అతను డిమాండ్ చేశారు. అవి ఇస్తేనే వివాహం చేసుకుంటానని, లేదంటే మీ అమ్మాయిని వివాహం చేసుకోనని మొండికేశాడు. కూతురు వివాహం చేయడానికి కార్డులు పంచి, లక్షలు ఖర్చు పెట్టి నిశ్చితార్థ వేడుకలు చేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారికే ఆ వ్యక్తి షాక్ ఇచ్చాడు.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పసల పర్వేశ్ విశాఖనగరం పెందుర్తిలోని ఓ రొయ్యల కంపెనీలో పని చేస్తున్నాడు. ఎంవీపీ కాలనీలో నివాసముంటున్న ఓ పోలీసు ఉన్నతాధికారి కూతురుతో పర్వేశ్కు పరిచయం ఏర్పడింది. ఆమె దంత వైద్య విద్య చదువుతోంది. ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. ఆడపడుచు కట్నం కింద ముందుగానే పర్వేశ్ కుటుంబ సభ్యులు రూ.పది లక్షలు తీసుకున్నారు. తర్వాత ఆగస్టులో విశాఖలోని ఆఫీసర్స్ క్లబ్లో నిశ్చితార్థం జరిగింది.
డిసెంబర్ 12న వివాహ ముహర్తం పెట్టుకున్నారు. అయితే పర్వేశ్ పని చేస్తున్న సంస్థకు ఐస్ అవసరం ఉంది. దీంతో సొంతంగా ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలని భావించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక పోలీస్ బృందం గాలిస్తోందని తెలిపారు.