రాజధాని మంటలు: షాకుల మీద షాకులు, తెరపైకి కొత్తగా..
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల పర్యటనల అనంతరం రాజధాని వేడి మరింత రాజుకుంది. అయితే, శుక్రవారానికి అది ఒకింత చల్లబడ్డట్లు కనిపించినప్పటికీ.. నేతల వ్యాఖ్యలు మాత్రం ఘాటుగానే కనిపిస్తున్నాయి. జగన్, పవన్ ఎఫెక్ట్తో చంద్రబాబు ఏకంగా రాజధాని శంకుస్థాపనను ముందుకు జరపాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
జగన్ పర్యటన.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటన అనంతరం రాజధాని వేడి బాగా రాజుకుంది. పవన్ ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం అంతటా చర్చకు దారి తీసింది. జగన్, పవన్ వ్యాఖ్యల పైన తెలుగుదేశం పార్టీ నేతలు ఘాటుగానే స్పందించారు.
ఈ నేపథ్యంలో రాజధాని విషయమై రోజుకో మలుపు తిరుగుతోంది. రైతులు సంతోషంగానే రాజధాని కోసం 34వేల ఎకరాల భూమి ఇచ్చారని ప్రభుత్వం చెబుతోంది. జగన్ మాత్రం బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. పవన్ కూడా పర్యటించి బలవంతంగా లాక్కోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
నేతలిద్దరి పర్యటన నేపథ్యంలో చంద్రబాబు ఫౌండేషన్ స్టోన్ ముందుకు జరుపుతామని చెప్పగా.. రాష్ట్ర మంత్రి అయ్యన్న పాత్రుడు మరో అడుడుగు ముందుకేసి షాకిచ్చాడు. ఆయన గుంటూరు రాజధానిగా అసలుకే ఎసరు పెట్టేలా మాట్లాడారు. గుంటూరులో రాజధాని వద్దనుకుంటే భూములిచ్చేందుకు విశాఖ రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
విభజన సమయంలో... రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల మధ్య ఘర్షణ వాతారవణం కనిపించిన విషయం తెలిసిందే. విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని కావాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేశారు. అయితే, 1956కు ముందు ఏపీ రాజధానిగా కర్నూలు ఉందని, ఆ తర్వాత సీమకు అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమవాసులు డిమాండ్ చేశారు.
విశాఖ రాజధానికి అనుకూలమని, తమ ప్రాంతం అన్ని విధాలుగా ముందంజలో ఉందని, రాజధానికి విశాఖ చాలా బాగుంటుందని ఉత్తరాంధ్ర వాసులు డిమాండ్ చేశారు. తీవ్ర వాదోపవాదాల మధ్యనే రాజధాని గుంటూరు పరిసరాల్లో నిర్ణయించారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు మరోసారి దానిని తెరమీదకు తేవడం గమనార్హం.
అయితే, ఇప్పుటికే భూసమీకరణ దాదాపు పూర్తయింది. మాస్టర్ ప్లాన్ సింగపూర్లో సిద్ధమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరోచోటు గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అయితే, ఈ వ్యాఖ్యలు నాయకుల మధ్య మాటల యుద్ధానికి మరోసారి దారి తీసే అవకాశాలు మాత్రం ఉండవచ్చునని అంటున్నారు.
ఇదిలా ఉండగా మంత్రి నారాయణ మరో విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎనిమిదివేల ఎకరాల్లో మాత్రమే భవనాలు నిర్మిస్తామన్నారు. మిగతా భూమిలో రైతుల వాటా, మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. సంతోషంగా ఉన్న రైతుల్లో అపోహలు పెంచడం సరికాదన్నారు.
కాగా, పవన్, జగన్ వంటి నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించి రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, తద్వారా రాజధాని ఆలస్యమైతే ఇబ్బందులు ఎదురవుతాయని భావిస్తున్న చంద్రబాబు.. దానిని మరింత ముందుకు జరిపే ఆలోచన చేశారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జూన్ బదులుకు మేలో ఫౌండేషన్ స్టోన్ వేయాలని చూస్తున్నారని తెలుస్తోంది.