మేయర్ అనురాధ దంపతుల హత్యకు ఆరు నెలల స్కెచ్: చిక్కిన వీడియో
చిత్తూరు: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించిన చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్యలకు సంబంధించి పోలీసులు కీలకమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న చింటూ సన్నిహితుడి ఇంట్లో నుంచి వారు ఓ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్నారు.
ఆ ల్యాప్టాప్లోని విషయాలను విశ్లేషించగా - మున్సిపల్ ఆఫీసులోకి ఎలా వెళ్లాలి, ఎలా హత్య చేయాలి అే విషయాలపై చింటూ ముందుగా వేసుకున్న మొత్తం స్కెచ్ ఓ వీడియో రూపంలో ఉన్నట్లు తెలిసింది. దాదాపు ఆరు నెలల నుంచి మేయర్ దంపతుల హత్యకు కుట్ర పన్నుతున్నట్లు ఆ వీడియో ద్వారా తెలిసింది.
ఇంత జరుగుతున్నా పోలీసులకు గానీ, నిఘా వర్గాలకు గానీ ఎక్కడా సమాచారం అందలేదు. గురువారం వరకు పోలీసులు ఈ కేసులో మొత్తం 11 మందికి నోటీసులు జారీ చేశారు. తాజాగా 14 మంది ఇళ్లలో సోదాలు నిర్వహించారు. బాంబు స్క్వాడ్తో తనిఖీలు చేసి చింటూ ఇంట్లో ఉన్న కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
మరో 14 మంది ఇళ్లలో సోదాలు చేసి, చింటూకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు. ఈ కేసులో 47వ వార్డు కౌన్సిలర్ పద్మావతి భర్త మురుగ అనే వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. కీలక నిందితుల పాత్ర ఈ కేసులో ఇంకా వెల్లడి కావాల్సే ఉంది. ఇప్పటి వరకు 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.