హోదా ఎందుకు ఇవ్వడం లేదు?, ప్రజలు క్షమించరు: లోకసభలో మేకపాటి, అవంతి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి లోకసభలో ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని మంగళవారం జరిగిన సమావేశంలో నిలదీశారు. హోదాపై కేంద్ర ప్రభుత్వం ప్రకటనతో ఏపి ప్రజలు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని మేకపాటి డిమాండ్ చేశారు. ఏపి ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉందని చెప్పారు. ఏపికి రాజధాని లేదని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. హోదా ఇవ్వకపోతే ప్రజలు క్షమించరని అన్నారు.
తెలుగుదేశం ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఏపిని పునాదుల నుంచి నిర్మించాల్సి ఉందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. హోదా ఇవ్వకపోవడంపై ఏపి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. లోటు బడ్జెట్ను భర్తీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
విభజనతో ఆర్థికంగా ఏపి నష్టపోయిందని అవంతి శ్రీనివాస్ చెప్పారు. సాధ్యమైనంత త్వరగా ఏపికి ప్రత్యేక ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని శ్రీనివాస్ ఆరోపించారు. కాగా, కేంద్రమంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. ఏపి ఎంపీలు కోరిన ప్రత్యేక హోదా అంశంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేంద్రం ఏపిని ఆర్థికంగా ఆదుకుంటుందని చెప్పారు.