‘ఏపీలో మైక్రోసాఫ్ట్ సెంటర్: భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం’
హైదరాబాద్: ప్రపంచమంతా భారత్ వైపు, భారత్.. ఆంధ్ర ప్రదేశ్వైపు చూస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మైక్రోసాఫ్ట్ తన 11వ అభివృద్థి కేంద్రాన్ని (డెవలప్మెంట్ సెంటర్) రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ముందుకొస్తోందని ఆయన తెలిపారు. అమెరికాలో 500 కంపెనీలు 2 బిలియన్ యూఎస్ డాలర్ల వ్యాపారం చేస్తున్నాయని, వీరిదగ్గర 60వేల నుంచి 70వేల మంది పనిచేస్తున్నారని, అందులో 8 కంపెనీలు ఇప్పుడు విశాఖకు వచ్చాయని, మరో 32 కంపెనీలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
జ్యోతీ ప్రజ్వలన
ఈ కంపెనీలు విశాఖలో 2 వేల మందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి వస్తున్నాయని చెప్పారు. వారినిచూసి మరిన్ని కంపెనీలు ఇక్కడికొస్తాయని వెల్లడించారు. సీతమ్మధారలో 8 అమెరికన్ ఐటీ కంపెనీలను గురువారం ఆయన ప్రారంభించారు. విశాఖకు వస్తున్న ఈ అమెరికన్ కంపెనీల్లో ఒక్కోటి రూ.10కోట్ల నుంచి రూ. 30 కోట్ల టర్నోవరు చేస్తున్నాయని చెప్పారు. అంతకుముందు ప్రవాసాంధ్రుల సహకారంతో 13 జిల్లాల పరిధిలోని 1,208 ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతులను విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ భవనం నుంచి ముఖ్యమంత్రి ప్రారంభించారు.
విద్యార్థులు
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో ఆయన ప్రసంగించారు. ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లోనూ డిజిటల్ తరగతులు నిర్వహించేలా చొరవ తీసుకుంటామన్నారు. డిజిటల్ తరగతులు, ఆన్లైన్ బోధన వల్ల ఉపాధ్యాయుల పోస్టులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. రానున్న నెల రోజుల్లో అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో వైఫై సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ మధ్యే రిలయన్స్జియో కంపెనీతో మాట్లాడామని ఉచితంగా వైఫై ఇచ్చేందుకు ఒప్పందం కుదిరిందని తెలిపారు.
అభినందన
ప్రవాసాంధ్రుల సహకారంతో రాష్ట్రంలో రూ.100 కోట్లతో 5వేల డిజిటల్ తరగతి గదులు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర అమెరికా ప్రతినిధి జయరాం కోమటి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు రూ. 4.50 కోట్ల చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. అనంతరం జయరాంను సన్మానించారు.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం
ప్రతి విశ్వవిద్యాలయంలో ఇంక్యుబేషన్ సెంటర్ల ద్వారా వినూత్న ఆలోచనలను ఆహ్వానిస్తామని, అవి సంపదను సృష్టించేవిలా, దేశానికి పేరుతెచ్చే సాంకేతికను సంపాదించేలా ఉంటే..వాటిని స్టార్టప్ కింద తీసుకుని ముందుకెళ్తామని సీఎం అన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ, కర్నూలు వరకు ఏపీ ఒక సిలికాన్వ్యాలీని తలపించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎన్నారై తెలుగు సొసైటీ ఐటీ కంపెనీల ప్రతినిధులు మురశీధర్, రవికుమార్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.కాగా, విజయనగరం జిల్లాలోని భోగాపురంలో నిర్మించతలపెట్టిన విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చంద్రబాబు తెలిపారు. దీంతో రవాణా సౌకర్యం మరింత మెరుపడనుందని చెప్పారు. భోగాపురాన్ని మరింత అందంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దేశంలోని ఒక మంచి నగరంగా తయారు చేస్తామని ఆయన అన్నారు.
శంకుస్థాపన
విశాఖ జిల్లా సబ్బవరం మండలం వంగలి గ్రామంలో 600 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (పెట్రోలియం యూనివర్శిటీ)కి చంద్రబాబు, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్గజపతిరాజు, సుజనా చౌదరి గురువారం శంకుస్థాపన చేశారు.
కేంద్రమంత్రులతో..
దేశంలోనే తొలి నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన కేంద్ర మంత్రి ప్రధాన్ ప్రధాన మంత్రి ఉజ్వల పథకాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు విశాఖలోని హెచ్పిసిఎల్ను 24 వేల కోట్ల రూపాయలతో విస్తరించనున్నారని చెప్పారు. అలాగే 38 వేల కోట్ల రూపాయలతో విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. గోదావరి, కెజి బేసిన్లో గ్యాస్, నిక్షేపాలు పెద్ద ఎత్తున ఉన్నాయని, త్వరలోనే రాజమండ్రి నుంచి శ్రీకాకుళం వరకూ గ్యాస్, పెట్రోలు, డీజిల్ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తామని వెల్లడించారు. సబ్బవరం ఎడ్యుకేషన్ హబ్గా రూపుదిద్దుకోనుందన్నారు.
కేంద్రమంత్రి
పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాట్లాడుతూ చంద్రబాబు, మోదీపై విశ్వాసం ఉంచి గెలిపించినందుకు ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు. ఇందులో భాగంగానే 600 కోట్లతో పెట్రోలియం యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తను కెనడా, సౌది, సింగపూర్ తదితర దేశాల్లో పర్యటించినప్పుడు అక్కడ కీలక పదవుల్లో ఏపికి చెందిన యువకులే ఉన్నారని గుర్తు చేశారు. వర్శిటీలో విద్యతోపాటు, స్కిల్ డవలప్మెంట్ శిక్షణ కూడా నాలుగేళ్లలో విద్యార్థులు పూర్తి చేస్తారని, ఆఖరి సంవత్సరం పూర్తి చేసేలోగా ఓఎన్జిసి, గెయిల్, హెచ్పిసిఎల్ వంటి కంపెనీల్లో ఉద్యోగ నియామకపత్రాలు కూడా ఇవ్వనున్నామని ప్రదాన్ చెప్పారు.
చంద్రబాబు
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దేశంలో 90 శాతం మందికి గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశామని, వచ్చే మూడేళ్లలో మిగిలిన పది శాతం మందికి కూడా గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని కేంద్రమంత్రి చెప్పారు. అందరికీ గ్యాస్ అందుబాటులో ఉంటే, కిరోసిన్ అవసరం ఉండదని, దీనివలన నాలుగు వేల కోట్ల సబ్సిడీ ఆదా అవుతుందని ఆయన చెప్పారు. 2016-17 నాటికి విశాఖలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీనికి డిసెంబర్లో శంకుస్థాపన చేస్తామన్నారు. తమది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు.గ్రామా గ్రామానికి పక్కా రోడ్లు వేస్తున్నామని, సమాచార వ్యవస్థను, విమాన, విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. దేశంలోని దారిద్య్రరేఖకు దిగువనున్న మహిళలకు తొలి గ్యాస్ సిలెండర్ను ఉచితంగా ఇవ్వనున్నామని ఆయన చెప్పారు. కాగా, పాకిస్థాన్ కుట్రలను, కుతంత్రాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోందని, దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.