జగన్కు అవగాహన లేదు, దూరదృష్టితోనే: మంత్రి అయన్నపాత్రుడు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే విమానాశ్రయాలు అవసరమని మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టుకు రైతుల నుంచి భూమి సేకరిచండాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేత జగన్ తీరుపై ఆయన మండిపడ్డారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు.
‘రాష్ట్రాభివృద్ధికి ఎయిర్పోర్టు అవసరమా? కాదా?' అని జగన్ను ఆయన ప్రశ్నించారు. విశాఖలో ఉన్నది నేవీ ఎయిర్పోర్టని, దూరదృష్టితోనే భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం చేపడుతున్నామన్నారు.
అభివృద్ధిపై అవగాహన లేని నేతలే ఎయిర్పోర్టులను అడ్డుకుంటున్నారన్నారు. ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా వైయస్ జగన్ ప్రజలను రెచ్చగొట్టడం శోచనీయమన్నారు.
రసాయన ఎరువులతో ఆహార పదార్ధాలు విషం: మంత్రి మృణాళిని
రసాయన ఎరువులతో ఆహార పదార్ధాలు విషంగా మారుతున్నాయని ఏపీ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ కె. మృణాళిని అన్నారు. ప్రజాపిత, బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అఖిల భారత రైతు జాగృతి యాత్రను మంగళవారం విజయనగరంలో ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రసాయన ఎరువులతో ఆహార పదార్ధాలు విషంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సాగులో సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల పట్ల రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేలా ఈ యాత్రను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన బ్రహ్మకుమారి సంస్ధను అభినందించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ ఎమ్.ఎమ్ నాయక్ మాట్లాడుతూ రైతులు సేంద్రీయ ఎరువుల ద్వారా సాగు చేస్తే వ్యవసాయ భూములు సారవంతంగా మారుతాయన్నారు.