ఓటుకు నోటు: 'తెలంగాణలో జరిగిన దానికి సంబంధం లేదు, ఇదీ బాబు నిజాయితీ'
ఓటుకు నోటు కేసులో వెలువడిన కోర్టు తీర్పు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజాయితీని మరోమారు రుజువు చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం అన్నారు.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో వెలువడిన కోర్టు తీర్పు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిజాయితీని మరోమారు రుజువు చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం అన్నారు. తెలంగాణలో జరిగిన సంఘటనలకు సంబంధం లేని చంద్రబాబును అల్లరి చేయాలనే దురుద్దేశ్యంతో ప్రతిపక్షాలు పన్నాగం పన్నుతున్నాయన్నారు.
'రాజకీయ నాయకుల్ని అసహ్యించుకునేలా జగన్ మాటలు'
నీతి, నిజాయితీలతో, నిబద్దతతో పని చేస్తున్న, రాజకీయాలు చేస్తున్న వ్యక్తిగా చంద్రబాబు తన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ఆయన పని చేస్తున్నారన్నారు. చంద్రబాబును విమర్శఇంచే హక్కు ఎవరికీ లేదన్నారు. నైతిక బాధ్యతతో రోజుకు 18 గంటలు పని చేస్తున్నారని, ఇది నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శం అన్నారు.
కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడుకు ఈ రోజు ఊరట లభించిన విషయం తెలిసిందే. చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్పై కోర్టు శుక్రవారం విచారించింది.
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణ పిటిషన్ వేశారు. దీనిపై చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు.. చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదన్న ఆయన తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించింది.
ఆళ్ల రామకృష్ణ, ఉండవల్లి వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారించాలన్న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది.
ఓటుకు నోటు కేసు: హై కోర్టులో చంద్రబాబుకు ఊరట
అంతకుముందు జరిగిన పరిణామాలు గమనించినట్గయితే, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన చంద్రబాబు స్టే తెచ్చుకోగా, సుప్రీంకోర్టు కల్పించుకుంది. నెల రోజుల్లోగా వాదనలు విని చంద్రబాబుపై విచారణ విషయమై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత నెలలో వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు.. నేడు తీర్పును వెలువరించింది.