అమరావతిలో రోడ్లు వేస్తే సరిపోదు, మా సంగతేంటి?: లోకేష్కు చేదు అనుభవం
ఒక్క రాజధానిలోనే రోడ్లు వేస్తే సరిపోదని, మా సంగతి కూడా పట్టించుకోవాలని మండిపడ్డారు.
చిత్తూరు: ఏపీ మంత్రి నారా లోకేష్, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన వీరిని గ్రామస్తులు నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇంతటి ప్రమాదం జరిగిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోడ్లు సరిగా లేవంటూ లోకేష్ ను నిలదీసిన గ్రామస్తులు.. ఒక్క రాజధానిలోనే రోడ్లు వేస్తే సరిపోదని, మా సంగతి కూడా పట్టించుకోవాలని మండిపడ్డారు. గ్రామస్తుల ఆవేశాన్ని అర్థం చేసుకున్న లోకేష్.. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చనిపోయినవారిలో 14మంది తెలుగుదేశం కార్యకర్తలే ఉన్నారని, పార్టీ తరుపున ఒక అన్నగా వారిని ఆదుకునేందుకే వచ్చానని అన్నారు.
జిల్లా టీడీపీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయంటూ వస్తున్న ఆరోపణలను లోకేష్ కొట్టిపారేశారు. అలాంటి వాటికి ఆస్కారం లేదన్నారు. పరిహారం కింద రూ.10లక్షలు చెల్లించడానికి సీఎం సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై విచారణ జరిగిన తర్వాత.. దాన్ని బట్టి నిందితులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ప్రతిపక్ష నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ లోకేష్ ఈ సందర్బంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై చేస్తున్న ఆరోపణలు సరికాదని, గ్రామస్తుల అనుమతి లేకుండా కొంతమంది ఇసుకను తరలిస్తున్నారని చెప్పుకొచ్చారు.
బొజ్జలకు కూడా చేదు అనుభవమే:
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కూడా లోకేష్ తరహా అనుభవమే ఎదురైంది. మృతుల కుటుంబాలను ఓదర్చడానికి వెళ్లిన ఆయనను గ్రామస్తులు నిలదీశారు. అంతకుముందు ఓ మృతుడి భార్య 'పదిలక్షలిస్తా నా భర్తను తెచ్చిస్తారా?' అంటూ భోరున విలపించింది.
మీ వెనుక ఉన్నవాళ్ల వల్లే ఇంత ఘోరం జరిగిపోయిందని ఆమె ఏడుస్తూ ఆరోపించింది. దీంతో వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బొజ్జల అక్కడి నుంచి వెనుదిరిగారు.
13కి పెరిగిన మృతుల సంఖ్య:
మునగళపాలెం మృతుల సంఖ్య 13కి పెరిగింది. స్విస్ ఆసుపత్రిలో చికిత్స పొందరు మరొకరు మృతి చెందడంతో మునగళపాలెం మృతుల సంఖ్య 13కి చేరింది. ప్రస్తుతం మరో నలుగురి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మృతుల కుటుంబాలను పరామర్శించినవారిలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి కూడా ఉన్నారు.