ట్యూషన్లు చెప్పి కష్టపడి పైకొచ్చా: ఉండవల్లి వ్యాఖ్యలకు నారాయణ ధీటైన జవాబు
అమరావతి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని, ప్రభుత్వ నిబంధనలకు లోబడే కష్టపడి పనిచేసి సంపాదిస్తున్నానని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. 1979 నుంచి తాను ట్యూషన్లు చెప్పేవాడినని, కష్టపడి పైకొచ్చానని అన్నారు.
ఉన్నత ప్రమాణాలతో దానిని దేశంలోని 8 రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యాసంస్థలుగా విస్తరించానని చెప్పారు. ఆ విద్యా సంస్థలు నడపడం ద్వారానే డబ్బు సంపాదిస్తున్నానని తెలిపారు. తాను సంపాదించే మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లిస్తున్నానని తెలిపారు.
రాజధాని నగరం ఎంపిక కమిటీలో ఎవరున్నారనేది పక్కనపెడితే ఆ కమిటీ ఏ ఒక్క ప్రాంతాన్నీ సిఫారసు చేయలేదని, పలు పట్టణాలను పరిశీలించి సూచనలు చేసిందని తెలిపారు. భూమి, నీరు, భౌగోళిక అనుకూలతలను పరిగణనలోకి తీసుకుని, మంత్రిమండలి క్షుణ్ణంగా పరిశీలించాకే ప్రస్తుత స్థలాన్ని ఎంపిక చేసిందని చెప్పారు.
దీన్ని రాజకీయంగా రాద్ధాంతం చేయడం తగదన్నారు. అనుమానముంటే శివరామకృష్ణన్ కమిటీ నివేదిక రెండో చాప్టర్ 34వ పేజీని చదవాలని ఉండవల్లికి సూచించారు. కాగా సోమవారం ఉండవల్లి రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి నారాయణ తనకు రూ.474 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారని, అంత ఆస్తి ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లో తన ఆస్తులు రూ. 474.70 కోట్లని మంత్రి నారాయణ పేర్కొన్నారని, ఈ ఆస్తులు ఏ వ్యాపారం చేసి సంపాదించారు? అని ప్రశ్నించారు. మంత్రి నారాయణ తన విద్యాసంస్థలను నారాయణ సొసైటీ పేరిట నడుపుతున్న సంగతి తెలిసిందే.
చట్ట ప్రకారం సొసైటీ ఆస్తులను సొంతానికి వాడుకునే హక్కు లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రి తన సొంత ఖాతాకు సొసైటీ నగదు బదలాయించుకున్నారా? లేక సీఎం చంద్రబాబుతో కలసి వ్యాపారం చేశారా? సొసైటీ చట్ట ప్రకారం విద్యాసంస్థలను లాభాపేక్ష లేకుండా నడపాలని అన్నారు.
సొసైటీని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తే నేరం. రూ. 474.70 కోట్లు ఎలా సంపాదించారో 15 రోజుల్లోపు వెల్లడించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ విషయంపై చట్ట పరంగా ముందుకెళ్లాల్సి ఉంటుందని మంత్రి నారాయణను హెచ్చరించారు. అసరమైతే దీనిని జాతీయ స్థాయిలో తీసుకెళతానని అన్నారు.