వర్గీకరణపై చిచ్చు పెట్టిన మంత్రి పుల్లారావు: డొక్కా చురకలు, సెల్ టవరెక్కిన నేత
గుంటూరు: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పుల్లారావు చేసిన వ్యాఖ్య చిచ్చు పెట్టింది. ఓ వైపు కాపు రిజర్వేషన్ల చిచ్చు రగుతులతుండగా మంత్రి వ్యాఖ్య మరో చిచ్చును రాజేసింది. ఎస్సీ వర్గీకరణ చేసేది లేదంటూ పుల్లారావు వ్యాఖ్యానించారు. దీంతో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
గుంటూరు జిల్లా రెంటచింతల మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల పక్కన గల రిలయన్స్ టవర్ ఎక్కి గుంటూరు జిల్లా ఎమ్మార్పీయస్ ప్రధాన కార్యదర్శి గాడిపట్టి శ్రీనివాస రావు హల్చల్ చేశారు. 24 గంటల్లోగా పుల్లారావు క్షమాపణ చెప్తేనే కిందకు దిగుతానని శ్రీనివాస రావు చెబుతున్నాడు.
పుల్లారావు క్షమాపణ చెప్పకపోతే కిందికి దూకేస్తానని శ్రీనివాస రావు బెదిరిస్తున్నాడు. దాంతో ఆయనను కిందకు దించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు.
ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మంత్రి పుల్లారావుకు చురకలు అంటించారు. మంత్రులు అన్నీ తెలుసుకుని మాట్లాడితే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ లేదని పుల్లారావు అన్నట్లు వార్తలు వచ్చాయని, ఇలాంటి వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీస్తాయని ఆయన అన్నారు. పుల్లారావు వంటివాళ్లు పూర్తి సమాచారం తెలుసుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.
మంత్రి పుల్లారావు తాను నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖపై పూర్తి దృష్టి పెడితే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. సున్నితమైన అంశాన్ని మాటల ద్వారా జటిలం చేడం సరి కాదని చెప్పారు. మాదిగలకు మందకృష్ణనే నాయకుడని, మందకృష్ణ నాయకత్వానికి పుల్లారావు సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణ సహా మాదిగ నేతలతో తాను ఆదివారం సమావేశమవుతానని డొక్కా చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తామని చెప్పారు.