మంత్రి రావెలకు చేదు అనుభవం: కారుపై కూలీల రాళ్ల దాడి, అద్దాలు ధ్వంసం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబుకు శనివారం రాత్రి చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు నగరంలోని హరిహరమహల్ సెంటర్లో చోటుచేసుకున్న ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మంత్రి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. అనంతరం సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యేలా ఆయన చర్యలు కూడా తీసుకున్నారు. అయితే సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన కూలీలు మంత్రి కారుపై దాడి చేశారు.
చేతికందిన రాళ్లతో మంత్రి రావెల కారుపై విసిరారు. ఈ దాడిలో మంత్రి కారు అద్దాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. దీంతో పరామర్శించేందుకు వస్తే... ఇదేం దాడి? అంటూ మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెనుదిరిగారు.
కాగా, భవన నిర్మాణంలో భాగంగా పునాది తవ్వకం పనులు చేస్తున్న కార్మికులపై మట్టిపెళ్లలు ఒక్కసారిగా విరిగిపడ్డాయి. ఎనిమిది మంది అందులో కూరుకుపోయారు. శనివారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. ఏడుగురు మరణించగా, ఒకరిని ప్రాణాలతో బయటకు తీశారు.
మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు నష్టపరిహారం
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ప్రకటించారు. ప్రమాదంపై సహచర మంత్రులతో చర్చించిన ఆయన అక్కడికక్కడే పరిహారానికి సంబంధించిన ప్రకటన చేశారు.
కూలీ పనులకు వచ్చి మృత్యువాత పడిన విద్యార్థులు, యువకులు
మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ఆయన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా రావెల పేర్కొన్నారు.
దీనిపై సమాచారం అందుకున్న ఏపీ హోం మంత్రి చినరాజప్ప కూడా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ... మృతుల కుటుంబాలకు బిల్డర్ తరపున రూ.15 లక్షలు, ప్రభుత్వం తరపున రూ.5 లక్షలను పరిహారంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.
ఏడున్నర గంటలకు ప్రమాదం జరిగితే తొమ్మిది గంటలకు గానీ సహాయక చర్యలు ప్రారంభం కాలేదు. దీంతో బాధితుల కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే... గుంటూరులోని డాక్టర్ సుబ్బారావుకు చెందిన స్థలంలో వాణిజ్య సముదాయం నిర్మించేందుకు అధికార టీడీపీ నేతలు చుక్కపల్లి రమేశ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారు.
బిల్డర్ చుక్కపల్లి రమేశ్ ఒత్తిడి
గత మూడు నెలలుగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. శనివారం సెల్లార్ నిర్మాణం పనులను తాము చేయలేమని, చుట్టూ పది అడుగుల స్థలం వదలకుండా సెల్లార్ నిర్మాణం చేపట్టారని, అదేవిధంగా రక్షణగా ఫెన్సింగ్ నిర్మాణం చేయలేదంటూ వారు పనులు నిలిపివేశారు.
దీంతో పనులు త్వరగా పూర్తి కావాలని, డబ్బు ఎక్కువ ఇస్తామని బిల్డర్ ఆశ చూపడంతోపాటు ఒత్తిడి చేశారు. దీంతో చేసేది లేక 30 అడుగుల లోతులో కాంక్రీట్ దిమ్మెలను నిర్మించేందుకు కూలీలు సన్నద్ధమయ్యారు.
ఈ సమయంలో ప్రశాంత్ అనే కార్మికుడిపై తొలుత మట్టిపెళ్లలు విరిగి పడగా, మిగతా వారు అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే భారీగా మట్టిపెళ్లలు, పక్కనే ఉన్న గోడ కూలడంతో మిగిలిన వారు సైతం అందులో చిక్కుకుపోయి మృతి చెందారు.
ఇదిలా ఉంటే ఘటనపై సమాచారం అందుకున్న నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మీ, సిటీ ప్లానర్ ధనుంజయరెడ్డి, ఇతర అధికారులు చేరుకోగా.. వారిపై మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల బంధువులు దాడి చేయడంతో సిటీప్లానర్ ధనుంజయరెడ్డికి గాయాలయ్యాయి.
మృతుల కుటుంబాలకు రూ.50వేల చొప్పున వైసీపీ పరిహారం
శనివారం రాత్రి జరిగిన భవన నిర్మాణ ప్రమాదంలో మృతిచెందిన వారికి వైసీపీ రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈమేరకు ఆపార్టీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం గుంటూరుకు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు.
ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ... రెండు రోజుల్లో తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శిస్తారన్నారు. అలాగే బాధిత కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు. కాగా, ఈ ప్రమాదానికి కారణమైన బిల్డర్ చుక్కపల్లి రమేష్ను వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ బాధిత కుటుంబాలు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు.