చంద్రబాబే సీఎం: హోదాపై రావెల ట్విస్ట్, ప్రేమ-విరోధం లేవని కోడెల
అమరావతి: రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటమే ఓ ప్రత్యేక హోదా అని మంత్రి రావెల కిషోర్ బాబు మంగళవారం నాడు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రత్యేక హోదా పైన కర్నూలులో జరిగిన యువభేరీలో జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన టిడిపి, బిజెపిల పైన నిప్పులు చెరిగారు. హోదా కోసం అవసరమైతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారన్నారు. ఈ నేపథ్యంలో రావెల స్పందించారు. నవ్యాంధ్ర సీఎంగా చంద్రబాబు గెలవడమే ఓ హోదా అన్నారు.
ఆయన నెహ్రూ హైస్కూల్ మైదానంలో జరిగిన చంద్రన్న దళితబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దళితులకు చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు.
ధళితుల్లో మానసిక చైతన్యం రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని, అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దోచుకున్నారన్నారు. దళిత పిల్లల విద్యా, ఉపాధిపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు.
ప్రేమ, విరోధం ఉండదు: కోడెల
తాను సభాపతిని అని, కాబట్టి సభలోని సభ్యులందరూ తనకు సమానమని, సభ్యులపై ప్రేమ, విరోధం ఉండదని ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు మంగళవారం అన్నారు. 12 మంది వైసిపి ఎమ్మెల్యేల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సభను సజావుగా నడపడమే తన బాధ్యత అన్నారు.