గన్నవరంలో హెచ్సీఎల్ బీపీఓ సెంటర్: 5వేల మందికి ఉపాధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో దిగ్గజ ఐటీ సంస్థ రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం వద్ద 17 ఎకరాల ఆర్టీసీ డ్రైవింగ్ పాఠశాల స్థలాన్ని హెచ్సీఎల్కు కేటాయించింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో దిగ్గజ ఐటీ సంస్థ రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం వద్ద 17 ఎకరాల ఆర్టీసీ డ్రైవింగ్ పాఠశాల స్థలాన్ని హెచ్సీఎల్కు కేటాయించింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఐటీ శాఖాధికారుల బృందం శుక్రవారం నోయిడాలోని హెచ్సీఎల్ కార్యాలయాన్ని సందర్శించనుంది. అక్కడ సంస్థ అధినేత శివనాడార్తో లోకేష్ భేటీ అవుతారు.
ఈ సమావేశంలో భూముల కేటాయింపు పత్రాలను, సంస్థ ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను అప్పగించనున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విజయవాడ నగరంలో ఐటీ కార్యకలాపాలు నిర్వహించడానికి హెచ్సీఎల్ ఆసక్తి చూపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అమరావతిలో అది ఒక పెద్ద బీపీవో ఏర్పాటు చేయనుంది. దానికంటే ముందుగా గన్నవరం వద్ద బీపీవోను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో స్థానికంగా ఐదు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. గన్నవరం వద్ద ఇచ్చే స్థలాన్ని ఆ సంస్థ ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలిగా అభివృద్ధి చేయనుంది.
ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని, ప్రధానంగా కృష్ణా, గుంటూరు, కోస్తా జిల్లాల్లోని వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను హెచ్ సీఎల్ ప్రారంభించింది. త్వరలోనే భవన నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.