ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్: కడియంను ఛాంబర్లో కలిసిన మంత్రి గంటా
హైదరాబాద్: ఏపీ ఉన్నత విద్యా మండలి వ్వవహారం రాజ్భవన్కు చేరింది. రాజ్ భవన్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి, ఎంసెట్ కౌన్సెలింగ్ విషయమై గవర్నర్తో చర్చించారు. సమావేశ అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ ఉన్నత విద్యామండలి, ఎంసెట్ పరీక్ష ప్రవేశాలకు సహకారంపై చర్చిస్తామన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమవుతారని చెప్పారు.
సమస్యసలను సామరస్యంగా పరిష్కరించుకోమన్నారు: మంత్రి గంటా
ఏపీ ఉన్నతవిద్యామండలికి కార్యాలయం కూడా లేదని మంత్రి గంటా గవర్నర్ దృష్టికి తీసుకువచ్చామన్నారు. వచ్చే నెల 12 ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున రికార్డులు అవసరమని, విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ఏపీ ఉన్నత విద్యామండలికి రావాల్సిన రికార్డులను, సిబ్బందిని ఇవ్వాల్సిందిగా గవర్నర్ను కోరామన్నారు.
ఇరురాష్ర్టాల మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించారని అన్నారు. ముందు మంత్రులు, అధికారుల స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత సీఎంల స్థాయిలో చర్చలు ఉంటాయని ఆయన చెప్పారు. ఎంసెట్ కౌన్సెలింగ్కు సహకరించాలని, సిబ్బందిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి గంటా తెలిపారు. దీనిపై తెలంగాణ మంత్రి కడియం సానుకూలంగా స్పందించారని తెలిపారు.
కడియం శ్రీహరిని ఛాంబర్లో కలిసిన మంత్రి గంటా:
తెలంగాణ విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆయన ఛాంబర్లో మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. ఏపీ ఎంసెట్కు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకోవడానికి స్థలం, డేటా కావాలని కోరారు.
పరస్పరం సహకరించుకోవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. సమస్యలను తామే సామరస్యంగా పరిష్కరించాలని నిర్ణయించామన్నారు. గవర్నర్ సూచన మేరకు కలిసి కూర్చుని మాట్లాడుకున్నామని చెప్పారు. ముఖ్యంగా వీరిద్దరి మధ్య ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్పై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
హైకోర్టు తీర్పు నేఫథ్యంలో ఏపీ ఎంసెట్కు సంబంధించిన పైళ్లు, రికార్డులను తిరిగి తమకు ఇవ్వాలని కడియంను మంత్రి గంటా కోరారు. అంతక ముందు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ఉన్నత విద్యా మండలికి సంబంధించిన ఎంసెట్ పైళ్లు, ఇతర రికార్డులను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.