కిడ్నాప్ చేసి బాలికపై ఇద్దరు గ్యాంగ్ రేప్
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం మోదలపల్లెలో మైనర్ బాలికను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగింది. తవణంపల్లె ఎస్సై ధరణీధర్ ఇందుకు సంబంధించిన వివరాలను అందించారు.
ఈనెల 27వ తేదీ రాత్రి మోదలపల్లె హరిజనవాడకు చెందిన ఓ బాలిక (15) బహిర్భూమికి వెళ్లగా అదే గ్రామానికి చెందిన రాజేష్ (22), ప్రదీప్ (22) బాలిక అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టి కిడ్నాప్ చేసి గ్రామ సమీపంలోని మామిడితోపులోకి తీసుకెళ్లారు. అక్కడ బాలికపై అత్యాచారం చేసిన అనంతరం మామిడిచెట్టుకు కట్టేసి పారిపోయారు.
బాలిక కోసం కుటుంబ సభ్యులు గాలించి ఇంటికి తీసుకొచ్చారు. ఈ మేరకు శనివారం రాత్రి బాధితురాలి కుటుంబ సభ్యులు తవణంపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.
కాగా, ఉద్యోగాలిప్పిస్తామని, పెళ్లి సంబంధాలు కుదురుస్తామని, డబ్బు, నగలు ఇస్తే వాటిని రెండింతలు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్న ఓ మహిళను, ఆమె ఇద్దరు కొడుకులను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కోటపల్లికి చెందిన వేముల మల్లిక (55), ఆమె ఇద్దరు కొడుకులు నాగేంద్ర (22), బాలాజీ (19)లు పీలేరుకు చెందిన ప్రభావతి అనే మహిళను ఇదే తరహాలో మోసం చేశారు. గతేడాది అక్టోబర్లో బాధితురాలు వీరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న వీరు మండల పరిధిలో 11 మందిని తమ మాయమాటలతో బోల్తాకొట్టి పెద్ద మొత్తంలో డబ్బు, బంగారు, వెండితో పరారయ్యారు. ఆదివారం వీరు కోటపల్లి క్రాస్వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా వీరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించడంతో వీరి మోసాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల వద్ద నుంచి 2.5లక్షల రూపాయలు విలువచేసే నగలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు సిఐ నరసింహులు తెలిపారు.