చార్మినార్ చూసేందుకు రూ.65వేలతో భాగ్యనగరానికి బాలుడు
హైదరాబాద్: చార్మినార్ గురించి టీచర్లు చెప్పిన పాఠాలు ఆసక్తిగా విన్నఓ నాలుగో తరగతి చదువుతున్న బాలుడు.. ఆ కట్టడాన్ని చూడాలనే కోరికతో హైదరాబాద్ వరకు వచ్చాడు. తన కోరికను నెరవేర్చుకునేందుకు ఇంట్లో కూడా ఎవరికీ చెప్పకుండా రూ. 65వేల డబ్బుతో నగరానికి చేరుకున్నాడు.
నాంపల్లి రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరుగుతుండగా.. అనుమానం వచ్చిన రైల్వే పోలీసులు అతడి వివరాలను ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. బాలుడితో పాటు డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రకాశం జిల్లాలోని బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.
వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లా కనిగిరి స్థానిక శివనగర్ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు కొత్తపల్లి వెంకట కార్తికేయకు చార్మినార్ చూడాలని కోరిక కలిగింది. దీంతో ఇంట్లో ఉన్న రూ. 65వేల నగదుతో హైదరాబాద్ రైలు ఎక్కాడు. నగదుతోపాటు కుమారుడు అదృశ్యం కావడంతో అతని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.
రైలు ఎక్కిన కార్తికేయ నాంపల్లి రైల్వే స్టేషన్లో అటు ఇటు తిరుగుతుండగా అనుమానం వచ్చిన రైల్వే ఎస్ఐ ఇబ్రహీం అతడ్ని ప్రశ్నించాడు. తాను చార్మినార్ చూసేందుకు వచ్చానని, తన వద్ద నగదు కూడా ఉందని చెప్పాడు. దీంతో ఇబ్రహీం కనిగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్ చేరుకున్న కార్తికేయ తల్లిదండ్రులకు కుమారుడితోపాటు, నగదును అప్పగించారు పోలీసులు. తమ కుమారుడు క్షేమంగా లభించడంతో ఆ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.