బాబు ప్రజెంటేషన్పై మిత్సుబిషి ఆసక్తి: పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా జపాన్లో పర్యటిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూసుకుపోతున్నారు. ఆదివారం సాయంత్రానికి జపాన్ రాజధాని టోక్యోలో అడుగుపెట్టిన చంద్రబాబు, అక్కడి దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా సమావేశమవుతున్నారు.
ఈ క్రమంలో తొలిరొజైన సోమవారం పుజి ఎలక్ట్రానిక్స్, మిత్సుబిషి కార్పోరేషన్ తదితర సంస్ధల ప్రతినిధులతో సమావేశమయ్యారు. చంద్రబాబు ప్రజెంటేషన్పై ఆసక్తి కనబరచిన మిత్సుబిషి విశాఖలో సమాచార అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.
మిత్సుబుషీ కంపెనీ కృష్ణపట్నంలో క్లస్టర్ ఏర్పాటుకు ఆసక్తి చూపించింది. దీంతో పాటు తునిలలో తమ యూనిట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. తునిలో ఏర్పాటు చేయనున్న తమ ప్లాంట్కు రవాణా సౌకర్యాన్ని కల్పించాలని చంద్రబాబును కోరారు.
కేవలం వంద రోజుల్లోనే సదరు రోడ్డును నిర్మిస్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. వీటితో పాటు కృష్ణా జిల్లాలో గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టును కూడా చేపడతామని మిత్సుబిషి ప్రకటించింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు చెన్నై - బెంగళూరు ఇండస్ర్టియల్ కారిడార్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై దృష్టి సారించాలని జపాన్ కంపెనీలను సీఎం చంద్రబాబు కోరారు. చంద్రబాబు తన ప్రజంజేషన్లో ఏపీలో ఐరన్, బాక్సైట్ వంటి అపార ఖనిజ సంపద ఉందని చెప్పారు. మయావకా కంపెనీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమై గోదావరి జిల్లాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడారు.