జగన్ దీక్షకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి దూరం: ఆయన సోదరుడు కూడా..
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో చేపట్టిన ప్రత్యేక హోదా దీక్షకు కడప జిల్లాకు చెందిన దేవగుడి సోదరులు దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ సి.నారాయణరెడ్డి, వారి అనుచరులు ఎవ్వరు కూడా ఆందోళనలో పాల్గొనలేదు.
దాంతో దేవగుడి సోదరులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీని వీడుతున్నారన్న వాదనలకు బలం చేకూరుతోంది. దేవగుడి సోదరులను పార్టీలో చేర్చుకునే విషయమై టిడిపి అధిష్ఠానం నుంచి స్పష్టమైన సంకేతాలు రాలేదు. వారిని చేర్చుకునే విషయంపై టిడిపి అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. జమ్మలమడుగు టిడిపి ఇంచార్జీ రామసుబ్బారెడ్డి వారిని చేర్చుకోవద్దని పట్టుబడుతున్నారు.
ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, ఆయన కుమారుడు నారా లోకేష్ను కలుసుకుని పార్టీలో చేరడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి వారి చేరికను వ్యతిరేకిస్తున్నందున తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆదినారాయణ రెడెడ్ిని పార్టీలో చేర్చుకోవద్దని రామసుబ్బారెడ్డి నేరుగా ఫిర్యాదు చేసినప్పుడు చంద్రబాబు మీ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారే తప్ప దేవగుడి సోదరులను పార్టీలో చేర్చుకోబోమని చెప్పలేదని తెలుస్తోంది. కుటుంబంతో పాటు వర్గాన్ని మొత్తం పార్టీలోకి తీసుకురావాలని టిడిపి అధినేత ఆదినారాయణ రెడ్డితో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే ఆది తన అనుచరులు, కుటుంబ సభ్యుల మద్దతు కూడగట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఆదినారాయణ రెడ్డిని నిలువరించేందుకు కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి, జిల్లాలోని మరికొంత మంది పార్టీ నాయకులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఏ ఒక్కరితోనూ ఆది పార్టీలో కొనసాగుతానని చెప్పిన దాఖలాలు లేవు.
రామసుబ్బారెడ్డిని ఒప్పించిన తర్వాతనే దేవగుడి సోదరుల చేరికకు గ్రీన్సిగ్నల్ ఇవ్వాలన్న నిర్ణయానికి టిడిపి అధిష్ఠానం వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ సొంత జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పా్టీని దెబ్బతీయాలనే పట్టుదలతోనే టిడిపి అధిష్ఠానం దేవగుడి సోదరులతో పాటు మరికొంతమంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులకు గాలం వేస్తున్నట్లు సమాచారం.