వైఎస్ హయాంలోని అయేషా కేసు మాటేమిటి: అనిత, రిషికేశ్వరి పేరంట్స్ మాట ఇదీ..
రాజమండ్రి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన రిషికేశ్వరి మృతి కేసు విషయంలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును తెలుగుదేశం పార్టీ పాయకరావుపేట శాసనసభ్యురాలు అనిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.రిషితేశ్వరి కేసులో ప్రభుత్వం సీరియస్గా ఉందని ఆమె స్పష్టం చేశారు.
ఐదు రోజుల్లో బాలసుబ్రమణ్యం కమిటీ నివేదిక వస్తుందని, దాని ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని ఆమె చెప్పారు. విపక్షాలకు శవ రాజకీయాలు అలవాటయ్యాయని ఆమె ఆరోపించారు. వైఎస్ హయాంలో ఆయేషా హత్య కేసు ఏమైందో అందరికీ తెలుసునని, దోషులెవరో తెలిస్తే ఆ వివరాలు కమిటీకి నిర్భయంగా చెప్పొచ్చని అనిత అన్నారు.
రిషికేశ్వరి తల్లిదండ్రులు ఏమన్నారు...
కాగా, అమ్మాయిలను ర్యాగింగ్ చేయాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని రిషికేశ్వరి తల్లిదండ్రులు దుర్గాబాయి, మురళీకృష్ణ విజ్ఞప్తి చేశారు. విచారణ కమిటీలో విద్యార్థి సంఘాల నేతలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉంటే బాగుండేదని అభిప్రాయడ్డారు.
ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ఏ విధంగా ఉంటుందో చూడాలని వారన్నారు. విద్యార్థులు లేకుండా విచారణ ఏమిటో తమకు అర్థం కావడం లేదని వారు విచారం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాన్ని తెరిపించి విద్యార్థులు వచ్చిన తర్వాత విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
విద్యార్థులతో మాట్లాడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు చెప్పారు. విశ్వవిద్యాలయ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉందని కమిటీకి తాము చెప్పినట్లు వారు తెలిపారు.