సొంత జిల్లాలో జగన్కు ఎమ్మెల్యే షాకిస్తారా?: రాచమల్లు వివరణ
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడపలో మరో షాక్ తగలనుందా? అంటే అవుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
బాబు క్లాస్ తర్వాత: వైసిపి నుంచి వచ్చిన నేతకు ఝలక్, చైర్మన్గా ఆసం
వైసిపి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో ఆయన సైకిల్ ఎక్కనున్నారని, చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
గత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరఫున నిలిచిన బిటెక్ రవి గెలిచిన విషయం తెలిసిందే. ఆయన గెలుపు నేపథ్యంలో కడప జిల్లా టిడిపి కొత్త ఉత్సాహంతో ఉంది. జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల మొదలు అన్నింటి పైనా కన్నేసింది.
కడప జిల్లాపై టిడిపి కన్ను
2019 నాటికి కడప జిల్లాలో వైయస్ జగన్కు షాకిచ్చేలా పట్టు సాధించి, సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా బలమైన నేతలను తమ వైపు ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు.
జగన్కు రాచమల్లు షాకిస్తారని..
రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా వైసిపిని వీడి టిడిపిలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయతే, దీనిపై ప్రసాద్ రెడ్డి స్పందించారు. తాను టిడిపిలో చేరుతున్నట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవం అని తెలిపారు.
రాజశేఖర్ అంటే ప్రేమ
వైయస్ రాజశేఖర రెడ్డి అంటే తనకు ప్రేమ, అభిమానం ఉందని రాచమల్లు స్పష్టం చేశారు. జగన్ అంటే కృతజ్ఞత ఉందని తెలిపారు. ఇకనైనా దుష్ప్రచారం ఆపేయాలని హితవు పలికారు.
మున్సిపల్ ఎన్నికల సమయంలో గలాటా
కాగా, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సమయంలో వైసిపి నుంచి వచ్చి టిడిపిలో చేరిన ముక్తియార్, అలాగే వరదరాజులు రెడ్డి వర్గీయుడు ఆసం రఘురామి రెడ్డి పోటీ పడ్డారు. వైసిపి నుంచి వచ్చిన ముక్తియార్కు తొలుత చైర్మన్ పదవి వచ్చేలా కనిపించింది. కానీ వరదరాజులు రెడ్డి పట్టుబట్టి తన ఆసంకు వచ్చేలా చేశారు. ఆ సమయంలో టిడిపిలోని రెండు వర్గాల మధ్య గొడవ, రాచమల్లు చెప్పుతో కొట్టుకోవడం చర్చకు దారి తీసింది.
గతంలోను ప్రచారం
రాచమల్లు ప్రసాద్ రెడ్డి టిడిపిలో చేరుతారని గతంలోను ప్రచారం సాగింది. కానీ తాను ప్రాణాలైనా వదులుతాను కానీ టిడిపిలో చేరనని చెప్పేశారు. తన జీవితంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని ఎప్పుడు వ్యతిరేకించలేదని తేల్చి చెప్పారు.