దమ్మున్న మగాడేనా?: చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు(వీడియో)
మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి ఆహ్వానించి, అరెస్ట్ చేయడమేంటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు.
విజయవాడ: మహిళా పార్లమెంటేరియన్ సమావేశానికి ఆహ్వానించి, అరెస్ట్ చేయడమేంటని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. గన్నవరం విమానాశ్రయంలో తనను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై రోజా తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను రానివ్వకుండా మహిళా సదస్సులు నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎయిర్పోర్టులో రోజా నిర్బంధం: అదుపులోకి తీసుకున్న పోలీసులు, తరలింపు
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూతురు, సీఎం చంద్రబాబునాయుడు కోడలు, తెలంగాణ సీఎం కూతురులను ఆహ్వానించుకునేందుకు ఇదేమైనా రాజకీయ సమావేశమా? అని ఆమె నిలదీశారు. చంద్రబాబుకు భయం పట్టుకుందని అన్నారు.
చంద్రబాబు దమ్మున్న మగవాడే అయితే.. బృందా కారత్ లాంటి మహిళా నేతలతోపాటు తనలాంటి వారిని పిలిపించి సదస్సులో మాట్లాడనివ్వాలని అన్నారు. ఇంత పిరికివాళ్లు, భయపడేవాళ్లను చూడలేదని అన్నారు. కోట్లు ఖర్చు చేసి సమావేశాలు ఏర్పాటు చేసింది మహిళల కోసమేనా? అని ప్రశ్నించారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను గన్నవరం విమానాశ్రయంలో శనివారం పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. బౌద్ధ గురువు దలైలామా అక్కడకు వస్తున్నారన్న కారణంతోనే ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఫైర్
చంద్రబాబుకు రోజాను ఎదుర్కొనే ధైర్యం లేదని వైయస్సార్ కాంగ్రెస్ మహిళా నేతలు ఈశ్వరీ, తదితరులు ఆరోపించారు. చంద్రబాబు భయపడాల్సిన అవసరం లేదని, ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా? అంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీని నిలదీస్తామని చెప్పారు.