'జగన్ పార్టీని అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత మీదే'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అన్నారు.
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అన్నారు.
ఉద్యోగులపై వైసిపి నేతలు చెవిరెడ్డి భాస్కర రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విశాఖ విమానాశ్రయంలో జగన్ దగ్గర నుంచి పోలీసు అధికారులతో... విజయసాయి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, తాజాగా చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఉద్యోగులపై ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. అందుకే వైసిపిని అధికారంలోకి రానీయవద్దన్నారు.
దేవుడు రాష్ట్రానికి ఇచ్చిన బహుమతి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అని జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు.
ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అత్యధిక శాతం మూడేళ్లలోనే నెరవేర్చామని మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. 90 శాతం ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారన్నారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మాట తప్పకుండా హామీలన్నీ నెరవేర్చుతున్నామన్నారు.
ఉద్యోగులపై నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా, నేను రాయలసీమ బిడ్డనే: చెవిరెడ్డి
నవ నిర్మాణ దీక్షతో నిధులు ఖాళీ
నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దీంతో ప్రజానిధులన్నీ ఖాళీ అయ్యాయని ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి వేరుగా విమర్శించారు.
నవ నిర్మాణ దీక్షలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేవలం ప్రచార ఆర్భాటాల కోసమే దీక్షలను చేపట్టి వాటిని విజయవంతం చేసేందుకు అధికారులను ఉపయోగించుకుని గత వారం రోజులుగా రాష్ట్రంలో పాలనను స్తంభింప జేశారన్నారు.
నవ నిర్మాణ దీక్షల పేరుతో అధికారులందరినీ తరలించారని, అయితే మండలస్థాయిలో పేద ప్రజలు వివిధ సమస్యలపై అధికారుల వద్దకు వస్తే వారు మాత్రం అందుబాటులో ఉండటం లేదన్నారు. గత వారం రోజులుగా ప్రభుత్వ పాలన పక్కదోవ పట్టిందన్నారు.