జగన్ మారడని తెలిసే: జ్యోతుల, జగన్కి మరో షాక్.. టిడిపిలోకి ముస్తఫా!
విజయవాడ: వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలకు ఎంతమాత్రమూ ఉపయోగం లేదని ఆ పార్టీ నుంచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం అన్నారు. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. జగన్కు రాజకీయ అనుభవం లేదన్నారు. నాయకత్వ లోపం కారణంగానే ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారన్నారు. వైసిపి కనీసం ప్రతిపక్ష పాత్రను పోషించడంలో విఫలమవుతోందన్నారు. జగన్ మారడని భావించిన తర్వాతే వైసిపిని వీడానని చెప్పారు.
టిడిపిలోకి ముస్తఫా?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ముస్తఫా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు రింగ్ రోడ్డు సమీపంలో నిర్మితమవుతున్న మై ఫార్చ్యూన్ హోటల్ శంకుస్థాపన కోసం శనివారం నగరానికి వచ్చినప్పుడు గుంటూరు తూర్పు వైసిపి ఎమ్మెల్యే ముస్తఫా వచ్చి కలిశారు.
ముస్తఫా గత కొన్ని నెలలుగా వైసిపికి దూరంగా ఉంటున్నారు. ఆయన నరసారావుపేట తెలుగుదేశం పార్టీ ఎంపి రాయపాటి సాంబశివ రావు అనుచరుడు. ఈ నేపథ్యంలో ముస్తఫా కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారని అంటున్నారు.