కడపలో కోలుకోలేని దెబ్బ: వివేకా ఓటమిని జగన్ ముందే ఊహించారా?
కడప/అమరావతి: కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలతో పాటు కడప ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. కడప జిల్లాలో దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత వైయస్ కుటుంబానికి టిడిపి షాకిచ్చింది.
నెల్లూరు, కర్నూలును పక్కన పెడితే.. కనీసం కడపలోనైనా స్వల్ప మెజార్టీతో గట్టెక్కాలని వైసిపి అధినేత జగన్, ఆ పార్టీ నేతలు కోరుకున్నారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు.
కడప ఓటమి ఎఫెక్ట్, జగన్-వైసిపి ఢీలా: 'టిడిపిలోకి వైసిపి ఎమ్మెల్యేలు.. టచ్లో'
వైసిపి అభ్యర్థి వైయస్ వివేకానంద రెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీటెక్ రవి 38 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జగన్ సొంతగడ్డపై గెలుపు తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద ఉత్సాహమే. క్రాస్ ఓటింగ్ పైన వైసిపి నమ్మకం పెట్టుకున్నారు. కానీ అది జరగలేదు.
జగన్కు కోలుకోలేని దెబ్బ
కడపలో వైయస్ కుటుంబానికి ఎదురుగాలి వీస్తే అది వారికి కోలుకోలేని దెబ్బ. అందుకే మిగతా జిల్లాల మాట ఎలా ఉన్నా.. కడపలోనైనా గెలవాలని భావించారు. ఇంకా చెప్పాలంటే జగన్ తన బాబాయి వైయస్ వివేకానంద రెడ్డిని బరిలో దించారు.
సొంత ఇలాకాలో ఎలాగైనా సీటు గెలిచి, పరువు నిలుపుకోవాలని జగన్, వైసిపి నేతలు భావించారు. ఇందుకోసం జగన్ తన వంతు ప్రయత్నాలు చేశారు. టిడిపి కూడా ప్రతివ్యూహంతో ముందుకెళ్లింది. ఇరు పార్టీలు కూడా క్యాంపులను ఏర్పాటు చేశాయి.
క్యాంపు రాజకీయాలు చేశారు కానీ...
వారికి క్యాంపులోనే ఓటింగ్ పైన శిక్షణ ఇచ్చి, ఎన్నికలకు ముందు రోజు కడపకు తరలించారు. ఇరు పార్టీలు క్యాంపు విషయంలో వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు వెళ్లాయి. కానీ విజయం మాత్రం అనూహ్యంగా టిడిపిని వరించింది.
టిడిపిపై ఎలాగైనా విజయం సాధించాలని వైసిపి, జగన్ భావించినప్పటికీ.. వైసిపి అధినేతకు వివేకా ఓటమిని ముందే ఊహించారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.
అందుకు ఎన్నికలకు ముుందు రోజు ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ఏ పార్టీ అయినా తమ గెలుపు సులభమని చెబుతుంది.
సొంత ఇలాకాలో.. వివేకా ఓటమిని ఊహించారా?
ఇక, సొంత ఇలాకా కడపలో దాదాపు నలభై ఏళ్లుగా వైయస్ కుటుంబానిదే హవా. అక్కడ వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు కాంగ్రెస్, జగన్ సొంత పార్టీ పెట్టాక.. వైసిపి హవా కనిపించింది.
తన ఇలాగాలో జగన్ ఎవరిని నిలబెట్టినా వారి గెలుపు ఖాయం. కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన బాబాయి వైయస్ వివేకా ఓటమిని మాత్రం జగన్ ముందే గ్రహించి ఉంటారని అంటున్నారు.
ఏం చెప్పారంటే.. ఓటమిని ముందే గ్రహించారా?
గురువారం సాయంత్రం జగన్ మాట్లాడుతూ.. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. తన ఇలాకాలో దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.
కడపలో అధికార పార్టీ ఎన్ని రాజకీయాలు చేసినా గెలుపు మాదేనని జగన్ చెప్పలేకపోయారని, దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం ద్వారా ముందే ఓటమిని గ్రహించారని తెలుస్తోందని అంటున్నారు. లేదంటే గెలుపుపై అప్పుడే ధీమా వ్యక్తం చేసేవారని గుర్తు చేస్తున్నారు.